మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్ లభించింది. కాంగ్రెస పార్టీ నుంచి టీఆరెస్లో చేరిన ఆమె.. మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారనే కమిట్మెంట్ తీసుకున్నది. మొన్నటి ఎమ్మెల్యే కోటాలో మిస్ అయ్యింది. లోకల్ బాడీ ఎమ్మెల్సీలో పేరు ఖరారైన తర్వాత పక్కకు జరపబడింది. కవిత ఆ స్థానంలో మళ్లీ గెలిచింది. రాజ్యసభ ఇస్తామని ప్రచారం చేసినా.. ఆమె , ఆమె వర్గీయులు నమ్మలేదు. ఏదైనా కార్పొరేషన్ పదవి వరిస్తుందని మాత్రం ఊహించారు. కొంచెం ఓపిక పట్టారు.
ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ ఆమెకు తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్కు చైర్మన్ చేశాడు. ఇది కీలకమైన పోస్టే. ఇప్పటికే జిల్లాలో మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు కీలకమైన ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చాడు కేసీఆర్. ఇప్పుడు ఇదే సామాజికవర్గానికి చెందిన ఆకుల లలితకు ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ దక్కింది. ఆకుల లలిత అసంతృప్తితో ఉన్నదని, రేవంత్ రెడ్డి టచ్లోఉన్నాడనే ప్రచారం జరిగింది.
మరోవైపు మున్నురుకాపులు కేసీఆర్కు దూరమవుతున్నారనే భావన పెరుగుతున్నది. ఇదే సమయంలో జిల్లాకు చెందిన కీలక నేత, సీనియర్ నాయకుడు డీఎస్ నిన్న సోనియా గాంధీని కలవడం ప్రాధాన్యత సంతరించుకున్నది. జిల్లాలో మున్నూరుకాపుల ప్రాబల్యం బాగా ఉంటుంది. డీఎస్ ఆ సామాజికవర్గాన్ని ప్రభావితం చేయగల నేత. కాకతాళీయమే అయినా.. ఆకుల లలితకు ఈ సందర్భంలోనే కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
జిల్లాకు కీలక పదవులు దక్కుతున్నాయి. డీఎస్ సైతం కాంగ్రెస్లో చేరి జిల్లాపై మళ్లీ పట్టు సాధించాలని చూస్తున్నాడు. మరోవైపు అర్వింద్ బీజేపీలో చేరి ఎంపీగా గెలిచి ఉనికి చాటుకునే పనిలో ఉన్నాడు. ఎన్నికల సమయం వరకు జిల్లాలో రాజకీయాలకు మరింత రంజుగా మారనున్నాయి.