దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
రాష్ట్రంలో ‘గాడిద గుడ్డు’ రాజకీయాలు నడుస్తున్నాయి. ఘాటుగా తిట్టాలంటే… ఏమీ చేయకున్నా బాగా పొడిగితే గాడిద గుడ్డేం కాదు అనడం పరిపాటి. ఇది మరీ వెటకారానికి పరాకాష్ట అన్నమాట. ఈ వెటకార ప్రయోగాన్నే ఇప్పుడు ఒక పార్టీ మరో పార్టీపై ప్రయోగించుకుని పైశాచికానందం పొందుతున్నది.
దీన్ని ఈ పార్లమెంటు ఎన్నికల వేళ తొలత ప్రవేశపెట్టింది కాంగ్రెస్. సీఎం రేవంత్రెడ్డి. తన బహిరంగ సభల్లో ఏకంగా గాడిద గుడ్డు అనే గుడ్డు ఆకారంతో సహా బీజేపీని టార్గెట్ చేసి ఆ సింబల్ను ప్రదర్శిస్తున్నాడు. బీజేపీ ఇప్పటి ఇదీ చేసింది అని దానిపై రాసి ఈ కోడిగుడ్డు ఆకారం పై గాడిద గుడ్డు అని రాసి మరీ జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్.
దీనికి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు. బహిరంగ లేఖ కూడా ఒకటి రాశాడు. మీ పార్టీ గుర్తు చేతా..? లేక గాడిద గుడ్డా..? అని తను వెటకార వ్యంగ్యాస్త్రాన్ని సంధించాడు. కేంద్రం ఇప్పటి వరకు రాష్ట్రానికి ఏమేమీ చేసిందో వరుసుగా ఏకరువు పెట్టాడు ప్రెస్మీట్ పెట్టి. బీఆరెస్ కూడా ఈ ‘ గాడిద గుడ్డు’ రాజకీయాల్లో పాలుపంచుకున్నది.
రేవంత్ ఇప్పటి వరకు ఆరు గాడిద గుడ్లు పెట్టాడని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నది. రెండు లక్షల రుణమాఫీ ఇవ్వకుండా ఒక గాడిద గుడ్డు పెట్టాడని, వరికి ఐదు వందల బోనస్, కౌలు రైతుకు 15 వేలు, రైతు కూలీలకు 12 వేలు, విద్యార్థులకు 5 లక్షలు, నిరుద్యోగులకు నెలకు 4వేలు, మహిళలకు నెలకు 2,500… ఇలా వరుసగా ఆరు గాడిద గుడ్లను పెట్టాడని వ్యంగ్యంగా బాణాలు సంధింస్తున్నది సోషల్ మీడియా వేదికగా.