నమస్తే తెలంగాణ … అది అధికార పార్టీ పత్రిక. కానీ మూడేండ్ల నుంచి అక్కడ పనిచేసే ఉద్యోగులకు జీతాలు పెరగలేదు. ఇంక్రిమెంటు అనే మాట లేదు. ఎప్పుడు పెంచుతారో కూడా చెప్పరు. ఎవరికీ ఆ విషయం అంతు చిక్కదు. చూసీ చూసీ… ఉద్యోగులు విసిరి వేసారి ఇక తిరగబడుతున్నారు. మొన్న మహబూబ్నగర్లో ఎడిటోరియల్ సెక్షన్ ఉద్యోగులంతా పెన్డౌన్ చేసి నిరసన తెలపడం కలకలం రేపింది. ఎలాగోలా నచ్చజెప్పారు. ఇది అంతటా చర్చనీయాంశమైంది. ఇది మరవకముందే కీలకమైన హకీంపేట ఎడిషన్ సెంటరల్ మరో ఆందోళన. ప్రింటింగ్ సెక్షన్ ఉద్యోగులంతా మూకుమ్మడిగా మెరుపు సమ్మెకు దిగారు. నిన్న రాత్రి పదిన్నరకు స్టార్ట్ కావాల్సిన ప్రింటింగ్ను నిలిపివేశారు. జీతాలు పెంచుతారా… లేదా…? అప్పటి వరకు ప్రింటింగ్ ఆపేస్తామని ఆందోళనకు దిగారు.
దాదాపు గంటన్నర పాటు ప్రింటింగ్ ఆగిపోయింది. విషయం ఎడిటర్కు తెలిసింది. వాళ్లతో ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఎడిటర్ది. అందుకే నెట్ వర్క్ ఇన్చార్జి ఎస్జీవీ శ్రీనివాసరావును రంగంలోకి దింపాడు. హుటాహుటిన ఎస్జీవీ అక్కడకు చేరుకున్నాడు. బతిమాలాడు. ఓ రెండు నెలలు టైం ఇవ్వండి ప్లీజ్ అన్నాడు. అప్పటికీ జీతాలు పెంచకపోతే మీతో పాటు నేనూ పోరాడతానని వారికి నచ్చజెప్పాడు. ఎలాగోలా ఆందోళన సద్దుమణిగడంతో మేనేజ్మెంట్ ఊపిరి పీల్చుకుంది.