ఢిల్లీ లిక్కర్ స్కాంపై తనపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కేసీఆర్ను మానసికంగా దెబ్బతీసేందుకు… తమ కుటుంబాన్ని బలహీన పర్చేందుకు.. బట్టకాల్చి మీదేసే విధంగా బీజేపీ ప్రవర్తిస్తున్నదని ఆమె అన్నారు. దేనికీ భయపడేది లేదని, వెనక్కి తగ్గేదే లేదన్నారు. కేసీఆర్ మార్గదర్శకంలో ముందుకు సాగుతామని అన్నారు. ఆమె ఏం అన్నారో ఆమె మాటల్లోనే…
నిన్న రకరకాల కథలు వచ్చాయి మీడియాలో. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు చెప్పాలనుకున్న విషయమేమిటంటే…
ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో నాకు ఆ అంశానికి ఎటువంటి సంబందం లేదు. దేశ వ్యాప్తంగా ఒక కక్షపూరితమైన ఆరోపణలు చేయడం… ప్రతిపక్షాలపైన బట్టకాల్చి మీదేసే నైజంగా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మంచి పద్దతి కాదు. ప్రజాస్వామ్యంలో నిరాధారంగా ఆరోపణలు చేయాలనే వైఖరి ఇది ఆరోగ్యకరమైనది కాదు. ఈ అంశంలో నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకర్థమైందేంటంటే.. కేసీఆర్ బిడ్డ కదా…బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్ ఆగమైతరేమోనని, భయపడతరేమోనని అనుకుంటున్నారు. మోడీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్న కేసీఆర్ వెనక్కి తగ్గుతారని భ్రమించి ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు.
ఇదో వ్యర్థ ప్రయత్నం..ఇవి వ్యర్థంగానే మిగిలిపోతాయి.దీంట్లో వచ్చేది లేదు సచ్చేది లేదు. ఈ సాకుతో ప్రతిరోజూ ఏదో కథనం వండి వార్చి ఇచ్చే ప్రయత్నం తో పాటు కేసీఆర్ను మానసికంగా కృంగదీసే ఓ వ్యర్థ ప్రయత్నమే కానీ.. ఇందులో ఎలాంటి నిజం లేదు. తెలంగాణ ప్రజలకు తెలుసు… దేశ ప్రజలకూ తెలుసు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించే సమయంలో కూడా అనేక ఆరోపణలు ఎదుర్కున్నాం.. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగినం.ఇటువంటి వాటికి భయపడేది లేదు. దేశ అభివృద్ధి కోసం ఓ ఎజెండాతోని సీఎం కేసీఆర్ ముందుకు పోతావున్నారు. దీంట్లో మేం అంతా వారితో కలిసి నడుస్తున్నాం. భయపడేదే లేదు. మొన్న బిల్కీస్ భాను విషయం అడిగాను .. అంతకు ముందు ఉద్యోగాల విషయం లో నిలదీసినా… వీటికి జవాబు చెప్పకుండా ఉల్టా ప్రతిపక్షాల మీద ఆరోపణల దాడి చేసే వైఖరి మంచిది కాదు. బాగాలేదు. దీన్ని ప్రజలందరూ గమనించాలె.