దిశ డిజిటల్ పత్రికపై ఏవో శక్తులు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయని, ప్రతిష్ఠను దిగజారుస్తున్నాయని ఎడిటర్ మార్కండేయ ఓ ప్రకటన విడుదల చేశాడు. ఇదిప్పుడు మీడియా సర్కిళ్లలో చర్చ జరుగుతున్నది. అసలేం జరుగుతుంది..? దీనిపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది…?
యాడ్స్ విషయంలో విలేకరులను ఇబ్బందులు పెడుతున్నారనేది ప్రధాన ఆరోపణ. దీనికి ఎడిటర్ సమాధానమిచ్చాడు. అన్ని మెయిన్ పత్రికలు అనుసరిస్తున్న బాటలోనే మేం కూడా సాగుతున్నామని చెప్పాడు. అంటే యాడ్స్, టార్గెట్స్, విలేకరుల మెడపై కత్తి… ఇవన్నీ దిశ ఒక్కటే చేయడం లేదు.. అన్ని పత్రికలూ చేస్తున్నాయని పరోక్షంగా చెప్పాడు ఎడిటర్. ఆ లెక్కన చూస్తే.. నమస్తే తెలంగాణతో సహా.. మిగిలిన అన్ని పత్రికలదీ ఇదే దారి. కానీ ఈ పత్రికలన్నీ దిశ చాలా రెట్లు నయం.
ఎందుకంటే… కరోనా కష్ట సమయంలో ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా గెంటేశాయి. నమస్తే తెలంగాణతో పాటు సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి.. అన్ని పత్రికలదీ ఇదే దారి. అలాంటి కష్ట సమయంలో దిశనే చాలా మందికి ఉపాధినిచ్చింది. ఆదుకున్నది. ఓ దశలో దిశ వివిధ పత్రికల బాధిత రిపోర్టర్లకు సెల్టర్ ఇచ్చింది. ఆదుకునే వేదికైంది. నమస్తే తెలంగాణ నుంచి గెంటేయబడ్డ చాలా మంది ఇప్పుడు దిశలో చేస్తున్నారు. మార్కండేయ మనుషులనో, కట్టా శేఖర్రెడ్డి గ్రూపనో ముద్రవేసి నమస్తే తెలంగాణ ఎడిటర్ తీగుళ్ల క్రిష్ణమూర్తి వీరిని కరోనా సాకుతో మేనేజ్మెంట్ మెప్పుకోసం బలిపెట్టాడు. అది అందరికీ తెలిసిన సత్యం. మిగిలిన పత్రికలు ఉద్యోగులను ఊడబీకలేదా..? అంటే వాళ్లూ చేశారు. కానీ ఓ అధికార పార్టీ పత్రిక నిర్దాక్షిణ్యంగా ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడినా.. కేసీఆర్, కేటీఆర్ కూడా పట్టించుకోలేదు. అదీ అత్యంత విషాదం.
సరే, వార్తల విషయానికొస్తే.. అంతో ఇంతో నిఖార్సయిన వార్తలిస్తున్నది దిశ ఒక్కటే. చాలా పత్రికలు స్టాండ్ మార్చుకున్నాయి. సాక్షి, ఈనాడు .. ఏనాడో నమస్తే తెలంగాణ బాటలో నడవడం ప్రారంభించాయి. కేసీఆర్కు నమస్తే కొడుతూ బతకడం ప్రారంభించాయి. ఇక వీరికి యాడ్స్ ఇబ్బందులు లేవు. అప్పటికే ఉద్యోగులను చాలా మందిని గెంటేశారు కాబట్టి.. ఆ ఖర్చు కూడా తగ్గింది. ఆంధ్రజ్యోతి కూడా అంతో ఇంతో వార్తల విషయంలో టెంపర్మెంట్ చూపిస్తున్నది. ఇదెప్పుడు కేసీఆర్ను ఆకాశానికెత్తుతుందో..? ఎప్పుడు నేలకేసి కొడుతుందో తెలియదు.
ఈ కష్ట సమయంలో ఓ డిజిటల్ మీడియా ఇంత మందికి ఉపాది కల్పిస్తున్నది. ఇది నడవాలంటే యాడ్స్ కావాలి. ఒత్తిడి తప్పుదు. అందుకే వేధింపులూ తప్పవు. బాధిత సంఘంగా కొందరు ఏర్పడి.. దిశపై ప్రచారం మొదలు పెట్టారు. ఇది ఇప్పుడే ఆగదు. ఇంకా కథనాలు వస్తాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం.. కేసీఆర్ను ఢీ కొట్టి బతికి బట్టకట్టే పత్రికల్లో దిశ ఒక్కటి. ఇదొక్కటే. దీనిది పసి వయసు. కానీ ధైర్యం చేస్తున్నది. ఉనికి కోసం ఆరాటపడుతున్నది. ఇలాంటి ఆరోపణలు కామన్. దీనికే ఎడిటర్ అంతలా స్పందించడం కూడా అనవసరం.