తిట్టాలనుందా…. దానికో భాష ఉంది. విమర్శించాలనుందా..? దానికో పద్దతుంది. ఇంకా ఘాటుగా కడిగేయాలనుందా…? దానికీ ఓ దారి ఉంది. ఆరోపణలు గుప్పించాలనుందా..? ఇందుకూ ఓ మార్గముంది. అన్నింటికీ జర్నిలిజంలో చోటుంది. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ఎవరినైనా ఉతికారేయొచ్చు. కడిగిపారేయొచ్చు. కొన్ని పేర్లు పెట్టి.. కొన్ని లేకుండా. ఆరోపణలూ చేయవచ్చు. ఘాటు విమర్శలూ చేయవచ్చు. వీటన్నింటికీ జర్నలిజంలో ఓ చోటుంది. రాసే వాడికే కావాలి దమ్ము. కానీ ఇప్పుడో కొత్త ట్రెండ్ నడుస్తుంది. సోషల్ మీడియాలో నియమాలు లేవు, నిబంధనలు లేవు. నోటికేదొస్తే అది. నోటిదూల తీరేలా, అవి బండబూతులైనా సరే. యథచ్చేగా భాష… ఇందులో మహిళలనే సంస్కారానికీ చోటు లేదు.
తాజా ఉదాహరణ … శనార్థి తెలంగాణ. దీన్ని నడుపుతుంది తీన్మార్ మల్లన్న. ఎలాగూ ఓ టీవీ పేరుతో సీఎంను బాతాల పోశెట్టి అని నోరు పారేసుకున్నా ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత పై కూడా ఇలాంటి భాషే ప్రయోగిస్తున్నాడు జర్నలిజం ముసుగులో. కవితక్క పేరును తైతక్క అంటూ శునకానందం పొందుతున్నాడు. బతుకమ్మ, బొడ్డెమ్మ పేర్లను కవితకు ఆపాదించి వాటినీ అవమానించే రీతిలో భాషా ప్రయోగం చేస్తున్నా ఎవరూ పట్టించుకునే దిక్కు లేదు. అడిగేవాడూ లేడు. బహుశా పత్రికా స్వేచ్చకు అడ్డం తగలొద్దని వదిలేశారేమో…? ప్రెస్ అకాడమీ.. ఇంకా ఏవో మీడియా బాధ్యతలు చూసుకునే సంస్థలన్నీ చేతులు ముడుచుకుని కూర్చున్నాయి. ఇప్పుడు ప్రతీ ఒక్కడూ విలేకరే. ఓ స్మార్ట్ ఫోన్…. సోషల్ మీడియా అకౌంట్… చాలు. ఇష్టమొచ్చింది రాయొచ్చు. కానీ ఇలా శనార్థి తెలంగాణ అంటూ పేపర్ అంటూ అచ్చంగా అచ్చోసిన ఆంబోతులా అచ్చుగుద్ది మరీ వదిలినా ఎవరూ పట్టించుకోరు…. అదీ మరీ పత్రికా స్వేచ్చంటే…..