ఖర్గే విజయం ఊహించిందే. సోనియా కుటుంబం స్పాన్సర్ చేశారు కాబట్టి మల్లికార్జున్ ఖర్గే గెలిచి తీరుతారనేది ఆనాడే రూఢి అయింది. ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేసిన శశి ధరూర్ కూడా 1072 ఓట్లు తెచ్చుకోవడం విశేషమే.
కాకపొతే కాంగ్రెస్ పార్టీకి చురుకైన యువకుడు అధ్యక్షుడుగా వస్తాడేమో అని ఆశించే మాబోటివారికి ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధుడు అధ్యక్షుడు కావడం కొంచెం నిరాశ కలిగించింది. ఆయన అనుభవజ్ఞుడు కావచ్చు కానీ మోడీకి దీటుగా దేశవ్యాప్త పర్యటనలు చెయ్యగలరా? కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రాగలరా? అనేవి భేతాళ ప్రశ్నలే.
ఏమైనప్పటికీ దాదాపు పాతికేళ్ల తరువాత అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించడం, సోనియా, రాహుల్ గాంధీలు దూరంగా ఉండటం, గాంధీయేతర కుటుంబీకుడు అధ్యక్షుడు కావడం శుభపరిణామమే.
ఆయన్ను సజావుగా పనిచేయనిస్తారా? ఆయనకు తగిన గౌరవం దక్కుతుందా అనేవి చూడాలి.
కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం వెల్లివిరియడానికి దీన్ని సంకేతంగా భావించవచ్చా లేదా అనేది కూడా ఇప్పుడు చెప్పలేము. ఆయనకు గాంధీ కుటుంబం అందించే సహకారం, స్వేచ్ఛల మీద ఆధారపడుతుంది.
మల్లికార్జున్ ఖర్గే కు అభినందనలు, శుభాకాంక్షలు
మురళీమోహన రావు ఇలపావులూరి