నమస్తే తెలంగాణ… అధికార పార్టీ పత్రిక. ఎడిటర్గా కట్టా శేఖర్ రెడ్డి మారిన తర్వాత కొత్తగా కృష్ణమూర్తి వచ్చిన తర్వాత ఉద్యోగుల జీతాలు, జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. మేనేజ్మెంట్ కూడా కొత్త ఎడిటర్ ఏది చెబితే అది అన్నట్టుగా సాగింది. దీంతో నాలుగేండ్ల నుంచి ఉద్యోగులకు జీతాలు పెరగలేదు. తను తెచ్చిపెట్టుకున్న ఆంధ్రజ్యోతి ,ఇతర ఉద్యోగుల టీమ్కు మాత్రం భారీగా జీతాలు పెంచుకున్న కొత్త ఎడిటర్.. ఉద్యమకాలం నుంచి పత్రికనే నమ్ముకున్న వారి జీతాలు, జీవితాలను గాలికొదిలేశాడు. చాలా మందిని పీకేసీ రోడ్డు పాలు చేశాడు.
చూసీ చూసీ విసిగి వేసారి.. అడిగి అడిగి స్పందన లేకపోవడంతో కోపం కట్టలు తెంచుకోగా… ఇక ఉద్యమబాట తప్పదని డిసైడ్ అయ్యారు ఉద్యోగులు. మహబూబ్నగర్ టీం దీనికి నాంది పలికింది. పెన్డౌన్ చేశారు. జీతాలు పెంచితే గానీ పనిచేయమని ఆందోళన చేశారు. ఆ తర్వాత హకీంపేట్ ప్రింటింగ్ సెక్షన్ టీమ్ కూడా పని మానేసి తమ నిరసనను తెలిపింది. ఇజ్జత్ కాపాడుకునేందుకు మేనేజ్మెంట్ తంటాలుపడి అప్పటి వరకు ఏదో నచ్చజెప్పి పరిస్థితి తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. కానీ ఇది మరింత జఠిలం కానుందని మేనేజ్మెంట్కు అర్థమైంది. ఎట్టకేలకు నిన్న జీతాలను బట్టి పదిశాతం, ఏడు శాతం అంటూ జీతాలు పెంచి చేతులు దులుపుకున్నారు. వాస్తవంగా నాలుగేళ్ల నుంచి ఏడాదికి ఏడు శాతం పెంచినా.. ఇ ప్పటి వరకు దాదాపు 30 శాతం మేర జీతాలు పెరగాల్సి ఉంది. కాసీ ఇలా అత్తెసరు జీతాలు పెంచి ఉద్యోగుల నోర్లు మూయించారు.
ఓపిక నశించి, ఎట్టకేలకు పోరాటమే సమస్యకు మార్గమని ధైర్యం చేసి ఆందోళనకు దిగి మేనేజ్మెంట్ దిగివచ్చేలా చేసిన మహబూబ్నగర్, హకీంపేట్ టీంకు అభినందనలు…..