సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఎన్నిక పట్ల చూపిస్తున్న శ్రద్ధ ఇప్పుడు ఏ విషయంలోనూ చూపడం లేదనే విషయం అందరికీ తెలిసిపోయింది. ఇక్కడ టీఆరెస్ కచ్చితంగా గెలిచి తీరాలి. ఈటల రాజేందర్ కు తగిన శాస్తి జరగాలి. రాజకీయాల నుంచి ఈటల తప్పుకోవాలి. తనతో పెట్టుకుంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో ఇదో గుణపాఠం కావాలి మిగితా వారికి కూడా. అందుకే ఆయన హుజురాబాద్ను ఆషామాషీగా తీసుకోవడం లేదు. దళితబంధు ప్రవేశపెట్టినా.. అనుకున్నంత మైలేజీ వస్తలేదనేది ఆయన బాధ. అంతగా పాలాభిషేకాలు జరగలేదు మరి. అందుకే నిన్న సమీక్ష జరిపి.. అసలు ఈ దళిత బంధుపై ఎవరేమనుకుంటున్నారో ఆరా తీయండని పురమాయించాడు. ఓ వైపు సర్వేల మీద సర్వేలు చేపించుకుంటున్నారు. ఏ సర్వే చూసినా ఏమున్నది గర్వకారణం.. అంతటా డౌన్ ఫాల్ గ్రాఫ్ అనే వస్తున్నది. ఇంత బతుకు బతికీ..అన్నట్టుగా ఇన్ని చేసీ ఓడిపోయామో ఇజ్జత్ గంగలో కలిసినట్టేననే భయంలో కేసీఆర్ ఉన్నాడు.
కేసీఆర్ అమ్ముల పొదిలో ఇంకా చాలా అస్త్రాలున్నాయి. ఉంటాయి. ఆయనను తక్కువగా అంచనా వేసుకోవడానికి లేదు. సర్వే రిపోర్టుల ఆధారంగా ఎప్పటికప్పుడు తన వ్యూహాలు, ప్రణాళికలు మారుస్తూ ఉంటాడు.అంతిమంగా శత్రువు కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టడమే కేసీఆర్ టార్గెట్గా ఉంటుంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్కు ఇంకా పదిహేను రోజులు సమయం ఈజీగా పడుతుంది. ఆ లోగా కొత్త వ్యూహాలు, కొత్త అస్త్రాలు హుజురాబాద్ మీద ప్రయోగిస్తాడు కేసీఆర్. కేసీఆర్ ఎంత చేసినా.. మైలేజీ మాత్రం ఈటలకు పోతుంది. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. ఇప్పుడు కేసీఆర్ సీరియస్గా ఆలోచిస్తున్నది దీని గురించే. సర్వే ఫలితాలు చెబుతున్నదీ ఇదే..