రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్రెండ్ నడుస్తున్నది. మొన్నటి వరకు బీజేపీ రెచ్చగొట్టే, బూతు మాటలతో తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తే.. కొత్తగా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఇదే పంథాను మరింత పదును పెట్టాడు. వ్యక్తి దూషణలకు ఫస్ట్ ప్రయార్టీ ఇస్తున్నారు. అదే వారికి మైలేజీ ఇస్తున్నదని నమ్ముతున్నారు. విషాదమేమిటంటే… మన కేటీఆర్ కూడా వీళ్ల ఉచ్చులో ఇరుక్కున్నాడు. ఈట్ కా జవాబ్ పత్తర్ సే.. అంటూ ఆవేశంతో ఇచ్చిన స్పీచ్తో టీఆరెస్ నేతలు కూడా రెచ్చిపోతున్నారు. ఎవరికి వారే .. ఓరేయ్.. సాలె… హౌలె.. అని ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటున్నారు. ఒకడు రెండు తిడితే.. ఇంకొకడు ఇంకొకటి కలిపి తిడుతున్నాడు. బోడిగుండు, బట్టతల, గద్దముక్కు … ఇలా దేన్నీ వదలడం లేదు. కించపరిచేలా మాట్లాడాలి. హర్ట్ అయ్యేలా తిట్టాలి. సోషల్ మీడియాలో అది వైరల్ కావాలి. మనకు మైలేజీ రావాలి. అంతే. ఇదే విధానం ఇప్పుడు అమలవుతున్నది. మొన్నటి వరకు ఓపిక పట్టిన మన కేటీఆర్ కూడా ఇటీవల ఏదో మీటింగులో.. రేవంత్రెడ్డిని వాడు, వీడు… ఓరేయ్..తురేయ్.. అని మాట్లాడిండు. ఇంకేముంది.. అందరూ ఒక్కతాను ముక్కలై.. కుక్కల్లెక్క అరుసుకుంటున్నర మాట.. అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
తాజాగా డ్రగ్కేసులో కేటీఆర్ను ఇరుకున పెట్టేందుకు బట్టకాల్చి మీదేసింది కాంగ్రెస్. ఈరోజు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఈడీకి ఫిర్యాదు చేశాడు. అందులో కేటీఆర్కు సినిమా తారలతో పరిచయాలున్నాయని, అందుకే ఈడీ విచారణను అడ్డుకుంటున్నాడని పేర్కొన్నాడు. ఇంకా ముందుకెళ్లి.. మొన్నామధ్య గోవాకు ఎందుకు వెళ్లినట్టు? అని కూడా అడిగాడు. ఈ గోవా ముచ్చట రేవంత్ చాలా సందర్భాల్లో మాట్లాడాడు. కేటీఆర్ను నైతికంగా దెబ్బతీసేందుకు ఇంతకు మించి అవకాశం లేదనుకున్నాడో ఏమో.. రేవంత్ పలుసార్లు ఈ టాపిక్ తీశాడు. కానీ టీఆరెస్ శిబిరం నుంచి పెద్దగా స్పందన లేదు. ఈరోజు ఏకంగా ఈడీకి ఫిర్యాదు చేయించింది కాంగ్రెస్. కేటీఆర్ను నైతికంగా దెబ్బకొట్టి… ఆత్మ సంరక్షణలో పడేయాలనే ఆలోచనలతో కాంగ్రెస్ బట్టకాల్చి మీదేసింది. ఇలాంటి పరిస్తితి రాష్ట్ర రాజకీయాల్లో ఇదే మొదటది. ఇంకా ఎంతదూరం వెళ్తారో..? వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు సాకుతో ఎవరి పరువు ఎవరు ఎలా తీసుకుంటారో తెలియదు. అందరికీ రాజకీయాలే కావాలి. పార్టీల మనుగడే కావాలి. పరువు, ప్రతిష్టను కూడా అందుకు పణంగా పెట్టేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ కొత్త ట్రెండ్ ఇంకా ఎంతమేర పాతాళంలోకి జారి పరువును బజారుకీడుస్తుందో చూడాలి.