సోషల్ మీడియాలో తాజాగా హల్చల్ చేస్తున్న వీడియో నిజామాబాద్ జిల్లాలో వైరల్ కావడంతో పోలీసులు రౌడీషీటర్ను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రెండ్రోజుల క్రితం ఆరవ టౌన్ పరిధిలో నగర టీఆరెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఇమ్రాన్ షేహజాద్ ఫౌంహౌజ్లో విందు జరిగింది. పీడీ యాక్టులో నిందుతుడిగా జైలుకు వెళ్లిన ఆరీఫ్ కొన్ని నెలల క్రితం హైకోర్టు ఆదేశాల మేరకు బెయిల్ పై విడుదలయ్యాడు.
ఆరీఫ్ బెయిల్ పై విడుదలైన సందర్భంగా డైరీ ఫాంలో గల ఫౌంహౌజ్లో విందు ఏర్పాటు చేశారు. విందులో ఎంఐఎంకు చెందిన లీడర్లు, ఆరీఫ్ అనుచరులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో హల్ చేస్తున్న వీడియో ఆరీఫ్ తన వాహనం పై కూర్చోని తుపాకీని మూడు రౌండ్లు గాలిలోకి పేల్చాడు. సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఈ వీడియో అసలైన తుపాకీని గాలిలోకి పేల్చినట్లుగా వార్తలు రావడంతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం ఆరీఫ్ను అదుపులోకి తీసుకున్నారు. ఆరీఫ్ పై గతంలో నమోదైన కేసులకు సంబందించిన ఫైళ్లను పోలీసులు పరిశీలించారు. గతంలో ఎప్పుడైనా ఈ విధంగా ఆయుధాలు ఉపయోగించి నేరాలకు పాల్పడ్డాడా ?అనే కోణంలో ఈ విచారణ జరిపించినట్టు తెలిసింది.
ఆరీఫ్ ఉపయోగించిన తుపాకీని పరిశీలించిన పోలీసులు అది నకిలీ తుపాకీగా నిర్ధారించుకున్నారు. ఈ విధంగా సోషల్ మీడియాలో నకిలీ తుపాకీతో కాల్పులకు పాల్పడి ప్రజలకు భయాందోళనకు గురి చేసినందుకు ఆరీఫ్ తో మరో ఇద్దరి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తతంగం జరిగి రెండు రోజులు అయినా పోలీసులకు తెలియకపోవడం పై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఫౌంహౌజ్ ఓనర్,టీ ఆర్ ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిని పోలీసులు ఎటువంటి విచారణ చేయకపోవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.