అచ్చం హరీశ్ రావు మామలాగే మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడితే జనాలకు ఇంకా వినాలనిపించేది. ముచ్చట పెట్టినట్టు, మన మదిలోని అంతరంగాన్ని ఆవిష్కరించినట్లు కట్టిపడేసే మాట తీరు ఆయనది. అందుకే ఎక్కడ సభ జరిగినా వింటారు. టీవీలో చూస్తారు. కానీ ఇప్పుడు అవే చెప్పిన మాటలు చెప్పడం, చేయాల్సినవి చాంతాడంత మిగిలిపోయి ఉండడం జనాలకు విసుగెత్తిస్తున్నాయి. సేమ్ హరీశ్ కూడా అదే పంథాను ఎంచుకున్నాడు. హుజురాబాద్లో ఈ రోజు అడుగుపెట్టిన హరీశ్ సభలో మాట్లాడుతూ.. మరీ దిగజారి పోయాడు. మామను మించిపోయి అతిశయోక్తులు అవలీలగా వదిలాడు. మాటలతో మెస్మరైజ్ చేద్దామని నిలదీతల పర్వాన్ని ఎదుర్కొన్నాడు. ప్రశ్నల శరపరంపరను తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నించి చమటలు కక్కాడు.
హుజురాబాద్లో వారికి గెలుపు ఎంత అనివార్యమో.. ఆ గెలవడం ఎంత కష్టంతో కూడుకున్న పనో స్వయంగా హరీశ్రావు లాంటి నేత కుప్పలు తెప్పలుగా అబద్ధాలు వళ్లే వేయడం, ప్రలోభాల పర్వానికి తెర తీసి కించిత్ కూడా అవమానంగా ఫీల్ కాకపోవడాన్ని బట్టి తెలిసి పోయింది. ఓ ట్రబుల్ షూటర్గా తన కంటూ మంచి గుర్తింపు, ప్రజల వద్ద ఆదరణ ఉన్న నేత హరీశ్ రావు. కానీ మామ పెట్టిన బాధ్యత భారంగా మారిన సందర్భంలో పరిస్థితులు అక్కడ తీవ్ర ప్రతికూలతతో ఎదురైనా పరిస్థితుల్లో తను కూడా ఓ సాదా సీదా, ఓ మామూలు లీడర్ తరహా స్థాయికి దిగిపోయి మాట్లాడడం ఆశ్చర్యమనిపించింది.
మామూలుగా ఎన్నికల సందర్భంలో ఎన్నో మాటలు చెబుతారు. అలవిమాలిన హామీలెన్నో గుప్పిస్తారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరి దారి వారిది. ఇది సహజమే. కామన్గా జరిగేదే. కానీ ఓ ఉప ఎన్నికను బేస్ చేసుకుని మరీ ఇంతలా దిగజారి అబద్దపు మాటలు చెబుతూ ఇంకా ప్రజలను మభ్యపెట్టి, భయపెట్టి ప్రలోభాల ఆశపెట్టి గెలిచేందుకు పన్నుతున్న ఈ ఎత్తుగడలు ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. చాలా సందర్భాల్లో హరీశ్రావు తన ప్రసంగంలో తనని తాను, ప్రభుత్వాన్ని సెల్ఫ్గోల్ చేసుకున్నట్టుగానే మాట్లాడాడు.
- డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో ఈటలను ఆత్మ సంరక్షణలో పడేసేందుకు 4వేల ఇండ్లు మంజూరు ఇస్తే ఇంత వరకు కట్టలేదెందుకు? అని నిలదీశాడు. ఏ మంత్రి ఎన్ని ఇండ్లు కట్టాడో చెప్పాడు. వాస్తవానికి ఈ పథకం ఓ అట్టర్ ఫ్లాప్. కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. ఏ నియోజకవర్గంలో కూడా విజయవంతంగా ఇది అమలు కాలేదు. ఆ విషయం హరీశ్కు తెలుసు. కానీ మభ్యపెట్టే మాటలు చెప్పాడు. ప్రభుత్వ అసమర్ధత, ఫెయిల్యూర్ను ఈటలకు అంటగట్టే ప్రయత్నం చేశాడు.
- సొంత జాగ ఉన్న వాళ్లకు డబ్బులు ఇస్తామంటూ గత జనరల్ ఎన్నికల్లో చెప్పిన హామీ మళ్లీ ఇప్పుడు హరీశ్కు ఉపయోగపడింది. ప్రజలు నమ్మరని తెలిసి నమ్మబలికే విధంగా మాట్లాడాడు. కానీ అంతగా రెస్పాన్స్ రాలేదు. అంటే కొత్త పథకం కూడా హుజురాబాద్ వేదికగా అమలు కాబోతుందన్నమాట. ఇక్కడికే పరిమితం కూడా కాబోతుందన్నమాట.
- అభయహస్తం డబ్బులు మిత్తితో సహా చెల్లించి 2వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చాడు. ఎంతో మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కొత్త పింఛన్ల కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. వాటికి మోక్షం లేదు. అవి ఇప్పుడు ఇచ్చేలా కూడా లేదు. మరి కొత్తగా అభయహస్తం ముచ్చట ఎవరికి కావాలి? ఎవరు నమ్ముతారు?
- కల్యాణలక్ష్మీ పథకం బాగా లేదని ఈటల దీన్ని పరిగి ఏరుకోవడం కింద జమ కట్టాడని హరీశ్ ఈటలను ఇరికించే ప్రయత్నం చేశాడు. కల్యాణలక్ష్మీ మొత్తాన్ని ఇంకా పెంచుకుందామా? సార్తో చెప్పి పెంచిపిస్తాను.. అని హరీశ్ అనడం ఆయన దిగజారుడు రాజకీయాలకు అద్ధం పడుతుంది. ఓటర్లను ఎంతలా మభ్యపెట్టాలని చూస్తున్నాడో తెలిసిపోతుంది. ఓ పథకాన్ని గురించి సీఎంతో మాట్లాడి, ఆ మొత్తాన్ని పెంచుమని చెప్పి సీఎంతో ఒప్పించే ధైర్యం ఎవరికైనా ఉందా? హరీశ్తో సహ. ఓ ఆర్థిక మంత్రివై ఉండి ఖజానా పరిస్థితి ఘోరంగా ఉందని తెలిసీ, అసాధ్యమైన హామీలను ఇవ్వడం బాధ్యతారహిత్యం కాదా?
- రేషన్ బియ్యంతో సహా పప్పులు కూడా ఇచ్చామన్నాడు. కేంద్రం ఇచ్చిన పప్పులు కూడా మీ ఖాతాలో వేసుకోవడం ఎందుకు హరీశ్?
- నువ్వే అన్నావు.. 80శాతం హామీలు నెరవేరాయి.. ఇంకా 20 శాతం మిగిలి ఉన్నాయని.. మరి వాటి పరిస్థితి ఏంటీ? దానిపై మాట్లాడకుండా కొత్త హామీలెందుకు? నమ్మేదెవరూ?
- రెండేండ్లు మనమే ఉంటున్నాం అన్నావు.. రెండేండ్లదాకా కూడా హామీల అమలు పొడిగిస్తారా ఏంటీ కొంపదీసి? నిరుద్యోగ యువత గురించి మాట్లాడినప్పుడు తెలివిగా మగ పిల్లలకు పని కల్పించే విషయం అని మాట్లాడావు. నిరుద్యోగం అనే మాట పలికేందుకు కూడా అంత భయమేలా హరీశ్? ఇక్కడ ఉద్యోగాల గురించి చెప్పమంటే కేంద్రం ఎన్ని ఉద్యోగాలు పీకేసింది.. అంత మందిని రోడ్డు పాలు చేసింది అంటూ సాకులు వెతుక్కునే ప్రయత్నం చేసినప్పుడే మీ వైఫల్యం ఉద్యోగాల కల్పనలో కొట్టొచ్చినట్లు కనిపించింది.
- రైతుబంధు మొత్తాన్ని ఈటల తీసుకున్నాడని అన్నావు. మల్లారెడ్డి, పుల్లారెడ్డి, జీవన్రెడ్డి, ఏవన్ రెడ్డి.. వందల ఎకరాలు ఉన్న మీ సహచర మిత్రులు తీసుకోలేదా? అమలులో ఇంత లోపం పెట్టుకొని అవసరం దగ్గట్టుగా పక్కొడి మీద బట్టకాల్చి వేయడం ఎందుకు హరీశా?
- రెండు గుంటలకు, రెండు వందల ఎకరాలకు మధ్య పోటీ అని అభివర్ణించావు. వేల కోట్లు గుమ్మరిస్తూనే నువ్వు ఇచ్చే ఈ కలరింగ్, కవరింగ్ ఎవరు నమ్ముతారు? గెల్లుకు గెంటేడు భూమి లేదెమో.. ఆయన వెనుక ఉన్న నువ్వు, కేసీఆర్, ఎర్రబెల్లి, గంగుల, మొన్నమొన్న చేరిన చోటామోటా లీడర్లు.. అందరి దగ్గర వందల ఎకరాలు ఉన్నాయి కదా. కాదంటావా?
- దున్నపోతుకు గడ్డేసీ పాలు పిండుతామా? అని అడిగావు. పాత సామెతే. ఒకరిని గెలిపించి మరొకరి పై జిమ్మేదారి పెడితే చేస్తామా? అన్నావు. అంటే గెల్లు ఓడిపోతే ఇవేవీ చేయవా? నీ మాటల్లో దొరతనం, బెదిరించే తత్వం, ప్రలోభాలకు గురి చేసే నక్క వినయం అన్ని స్పష్టంగా కనిపించాయి. నువ్వు ట్రబుల్ షూటర్ అనుకున్నాము. రివర్స్గా నిన్ను నీవు కాల్చుకునే షూటర్ అనుకోలేదు. సో పిటీ.