సండే ఉదయం…
సీనియర్ జర్నలిస్టు, మిత్రుడి ఫోన్…
క్షేమ సమాచారాలన్నీ అడిగిన తర్వాత…
మీడియా గురించి వచ్చింది చర్చ.
“వ్యవస్థలన్నీ నాశనమై పోయాయబ్బా…?” అన్నాడు.
అర్థం కాలేదు. మళ్లీ ఆయనే అన్నాడు.
“తీన్మార్ మల్లన్న అనేటోడు జర్నలిస్టు ముసుగులో ఎలా ప్రవర్తిస్తున్నాడో చూస్తున్నాం కదా” అన్నాడు.
“మీడియా పేరు చెప్పి అచ్చం ఓ రౌడీలా మాట్లాడతాడు. బెదిరిస్తాడు. అసలు విలువలుంటాయా? ”
అన్నాడు.
“అవును…” ఏం మాట్లాడాలో తెలియక అలా వింటున్నాను. ఇంకేం చెబుతాడో అని.
“వాడు (తీన్మార్ మల్లన్న) కేసీఆర్ గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడతడు కదా… ఏనాడైనా మోడీని విమర్శించాడా? తప్పుబట్టాడా? విళ్లేషణ చేశాడా?”
“లేదు.. “అన్నాను నేను పొడిగా.
“మరెందుకు.. జర్నలిస్టు అని పోటుగాడిలా ప్రశ్నిస్తున్నాడు కదా.. అలా అందిరినీ ప్రశ్నించొచ్చు కదా. ఒక్కరినే టార్గెట్ చేసుడెందుకు? ”
“మరి మిగిలిన పత్రికల స్టాండ్ ఎలా ఉంది.? ఏదో ఒక పార్టీకి సపోర్టుగానే ఉంటున్నారు కదా?”
అన్నాను నేను. మధ్యలో కలుగజేసుకుంటు.
“వాళ్లు జర్నలిస్టులుగా చెలామణి అవడం లేదా? నచ్చిన పార్టీని మోస్తూ.. నచ్చని వాటిని తిట్టడం మీడియా అంతా చేస్తున్నదదే కదా.” మళ్లీ అన్నాను నేను.
“అవును. కరెక్టు.. నేను కూడా అదే అంటున్నాను. అందుకే వ్యవస్థలన్నీ చెడిపోయాయి అంటున్నాను.” అన్నాడు.
“తీన్మార్ మల్లన్న మాట్లాడే తీరు.. ప్రశ్నించే తత్వం బాగానే ఉందని జనాలు అనుకుంటున్నారు. అతన్ని హీరోలాగా చూస్తున్నారు.. కానీ దాని ముసుగులో వాడి బెదిరింపులు.. రౌడీయిజం.. ఇవన్నీ పోకడలు సరికావు.” అన్నాడు.
“ఈ పద్దతే సరికాదు.. కానీ జనాలకు అది ఎక్కుతున్నది. మీడియా రంగులు ఇప్పుడు పూర్తిగా మార్చుకున్నది. బయటపడుతున్నది.”అన్నాడు వైరాగ్యంగా.