గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీ పనులు చేస్తున్న కుటుంబాల నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. దీన్దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన (DDU-GKY) కింద జాబ్ కార్డు కలిగి వంద రోజులు పనులు పూర్తి చేసుకున్న కుటుంబాలకు ఉపాధి భరోసాను ఇవ్వనున్నది. ఆ కుటుంబాల్లోని నిరుద్యోగ యువతి, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే క్రమంలో వివిధ రంగాల్లో శిక్షణనిచ్చి జాబ్ ప్లేస్మెంట్ ఇచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వీరి వివరాలను సేకరించింది.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో వివరాల సేకరణ పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,24,823 కుటుంబాలలో 7,799 మంది నిరుద్యోగులను గుర్తించారు. వీరికి రిటైల్ సెక్టార్లో 90 రోజులు శిక్షణనివ్వనున్నారు. స్టైఫండ్ కింద రోజుకు రూ. 230 ఇస్తారు. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ (RSETI) ద్వారా నెల రోజుల శిక్షణనిచ్చి ఎలక్ట్రీకల్, ప్లంబర్, టైలరింగ్ తదితర రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కృషి విజ్ఞాన్ కింద నర్సరీల పెంపకం, గార్డెన్ మెయింటనెన్స్లో శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. హైదరాబాద్లోని ప్రముఖ కంపెనీలలో ప్లేస్మెంట్ ఇప్పించేందుకు అధికారులు చొరవ తీసుకోవాల్సి ఉంటుంది.