దళితుల పట్ల సమాజంలో చిన్నచూపు, వివక్ష ఉన్నదనేది ఎంత సత్యమో… వారి ఎదుగుదలను అడ్డుకుని వివక్ష పూరితంగా తమ రాజకీయ అవసరాలకు వివిధ పార్టీలు వాడుకుంటాయనేది అంతే సత్యం. దళితవాడ, దళిత ఐఏఎస్, దళిత ఐపీఎస్.. ఇలా ప్రత్యేకంగా వారిని సమూహం నుంచి వేరు చేసి చూసిననాడే, మాట్లాడినప్పుడే ఆ వివక్షను అర్థం చేసుకోవాలి. వారిని ఉద్దరించి మంచిపేరు సాధించాలనే తపనతో ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అంతిమంగా అవి వారిని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేవి కావు. ఎక్కడ ఏ పని చేపట్టినా.. ఏ పథకం ప్రవేశపెట్టినా ఆ పార్టీ అవసరాలుంటాయి. రాజకీయ లబ్ది ఉంటుంది. అది లేనిదే ఏ పార్టీ ఏమీ చేయదు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా అంతే. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెడ్తున్న దళితబంధు పథకం కొత్త వివాదాలకు తెరతీసింది. అదీ త్వరలో జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని… అక్కడే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయడం. మొన్నటి వరకు పట్టించుకోని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నియామకం కూడా హడావుడిగా జరిగింది. ఆ చైర్మన్ కూడా ఆ నియోజకవర్గానికి చెందిన ఎస్సీ నేతే. దీనిపై తాజాగా బీజేపీ సీనియర్ నేత యెండల లక్ష్మీనారాయణ స్పందించిన తీరు వివాదస్పదమయింది. ఓ టీవీ డిబేట్లో పదిలక్షలు ఇస్తే దళితులు తాగుబోతులవుతారని, వ్యసనాలకు అలవాటు చేసినట్లవుతుందని స్పందించారు. ఏ మాత్రం అవగాహన లేకుండా , కేసీఆర్ మీద కోపంతోనో, ప్రభుత్వం పై వ్యతిరేకతో ఏదో మాట్లాడదామనుకొని మధ్యలో దళితులను అవమాన పరిచేలా మాట్లాడటం ఆయన అవగాహన లేమిని పట్టించింది. డిబేట్లలో చాలా మంది నేతలు సోయి మరిచి ఏదేదో మాట్లాడేస్తరు. ఆ తర్వాత నాలుక్కర్చుకుంటారు. యెండలదీ అదే బాపతు. ఈ సారి ఏకంగా దళితులను హేళన చేస్తూ ఆయన మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఆ పథకం ఓట్ల కోసమే అని అందరికీ తెలుసు. అంతటా
అమలవుతుందా? దాని నిబంధనలేమిటి? దళితులను పారిశ్రామిక వేత్తలుగా చేసేందుకు ఈ పథకంలోని ప్రణాళికలేమిటీ? ఇలా నిర్మాణాత్మకమైన వాటిపై ప్రశ్నించొచ్చు. ప్రభుత్వ లొసగులను బయటకు తీయవచ్చు. కానీ సబ్జెక్టు వైజ్గా చర్చించేకన్నా ఇలా ఈజీగా నోటికొచ్చింది ఒకటి అనేసి బురదజల్లేస్తే సరిపోతుందనుకుంటే మొదటికే మోసం వస్తుంది.
అసలు దళితులు ఇప్పటికీఅలా ఉండటానికి ఈ పాలకులే కదా కారణం. వారిని ఎదగనివ్వరు. నిర్మాణాత్మక ప్రణాళికలు ఉండవు. అప్పటికప్పుడు లాభం చేకూర్చేటివి కావాలె. అది పార్టీ బలోపేతానికి ఉపయోగపడాలి. ఓట్లు రాలే పథకాలే అయి ఉండాలి. తక్షణ ప్రభావం ఉండాలి. శాశ్వత ప్రయోజనాలు ఉండొద్దు. మళ్లీ ఎన్నికలు రాగానే దళితుల కోసం స్కీంలు ప్రవేశపెట్టాలి. ప్రత్యేకంగా మేనిఫెస్టోలో స్థానం ఇవ్వాలి. మేమే ఉద్దరించబోతున్నాం… మేం లేకపోతే ఇక మీ బతుకులు ఇంతే అన్నట్టుగా ప్రసంగించాలి. పథకాలు రూపొందించాలి. వాటి అమలు మాత్రం అంతంతే ఉండాలి. ఆ తర్వాత వారంతా అంతే ఉండాలి.
ఎదిగినా దళితుడెంతటివాడిని చేశామో చూశారా అని అనాలి. ఊరి చివర గుడిసెల్లో ఉంటే మీ కోసం ఈ పథకాలు అని కొత్త పథకాల రాగం అందుకోవాలి.
ఇది నిరంతరం. దీనికి అంతు లేదు.
నాయకులకు వీరిపట్ల చిత్తశుధ్ది లేదు. అది ఏ పార్టీ అయినా.