దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

గత ప్రభుత్వం ఏళ్ల తరబడి రేషన్‌కార్డులు ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వంలో రేషన్‌కార్డులొస్తాయని అంతా భావించారు. కానీ ఆ ఆశలూ ఇప్పట్లో తీరేలా లేవు జనాలకు. ఆరు గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం .. రాగానే హడావుడిగా దరఖాస్తుల పేరుతో అందరి దగ్గర నుంచి సమాచారం తీసుకున్నది. ప్రధానంగా ఈ దరఖాస్తుల్లో ఆధార్‌, రేషన్‌కార్డే ప్రామాణికంగా తీసుకున్నది. ఇక్కడే మళ్లీ రేషన్‌కార్డులు లేనివారి ఆందోళన మళ్లీ మొదలయ్యింది. ఈ విషయాన్ని పసిగట్టిన ప్రభుత్వం.. ఓ వైట్‌ పేపర్‌పై రేషన్‌కార్డు దరఖాస్తులు కూడా తీసుకోండని అప్పటికప్పుడు ప్రజల ఆందోళనపై నీళ్లు చల్లింది. కానీ వీటి గురించి అధికారులు పట్టించుకోలేదు.

ఆ దరఖాస్తులను అలాగే ఉంచేశారు. ఆరు గ్యారెంటీల దరఖాస్తులనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. వీటి గురించి మాకింకా ఎలాంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి రాలేదని అధకారులు చెబుతున్నారు. ఆరు గ్యారెంటీల దరఖాస్తులు మాత్రం ఈ నెల 17 వరకు అప్‌లోడ్‌ చేసి సర్కార్‌కు సమాచారమిస్తారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4, 77, 808 మంది ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. 1.12 లక్షల మంది కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికే దాదాపు నాలుగు లక్షలకు పైగా రేషన్‌కార్డులున్నాయి.

దరఖాస్తు సమయంలో రేషన్‌కార్డు లేదని రాసిన వారి అప్లికేషన్లు అప్‌లోడ్‌ చేసినా… వాటిని పక్కన పెడతారు. రేషన్‌కార్డున్న వారివే ముందు వెరిఫికేషన్‌ చేసి అర్హులను జల్లెడ పడతారు. ఇక కొత్త రేషన్‌కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్న తరువాతే వీటిని అప్‌లోడ్‌ చేసి వివరాలు సేకరిస్తారు. ఆ తరువాత వెరిఫికేషన్‌ ఉంటుంది. రేషన్‌కార్డులు వచ్చిన వారు ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకుంటే అర్హులా కాదా అప్పుడు తేలుస్తారు. అప్పటి వరకు రేషన్‌కార్డులు లేవు. ఆరు గ్యారెంటీలు రావు..

You missed