దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

 

పరిస్తితులు ఎంతలా తారుమారయ్యాయంటే.. ఒంటరిగా పోటీ చేసేందుకు జంకేంతగా. ఇంకా వేరే దారి కనిపించనంతగా. మొన్నటి వరకు బద్ద శత్రువులమని నిరూపించుకునేందుకు ముప్పుతిప్పలు పడి తండ్లాడిన పార్టీనే ఇప్పుడు వారితో స్నేహ హస్తం చాచేంతగా. అవును.. ప్రస్తుతం రాజకీయ సర్కిళ్లలో ప్రధానంగా నానుతున్న చర్చ ఇదే. బీఆరెస్‌ రాజకీయ సమీకరణలో చర్చకు వస్తున్న ప్రధాన అంశమూ ఇదే. అసెంబ్లీలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని పార్టీని కోలుకోలేని దెబ్బతీసుకున్న నేతలు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారు. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటున్నారు. స్వయంకృతాపరాధం వారిని వెంటాడగా.. వెంటనే వచ్చిన పార్లమెంటు ఎన్నికలు తమ సత్తా ఏపాటితో నిరూపించుకునేందుకు పెట్టే అగ్ని పరీక్షలో మరింత మాడి మసై పోతామనే భయంతో వణికిపోతున్నారు.

అందుకే ఇప్పుడు కేటీఆర్‌ ఆలోచనలో కొత్త బీజం పడింది. అదే బీజేపీతో దోస్తానా. ఎప్పట్నుంచి ప్రజలకు, రాజకీయ నాయకులకు కొంచెం డౌట్‌.. వీరిద్దరూ ఒకటేనని. ఎంత చెప్పినా జనానికి మాత్రం ఇది మింగుడు పడలేదు. నమ్మారు కూడా. ఇప్పుడు నేరుగా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి కలిసి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. కారణం.. కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు. అవును.. ఇప్పడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ హవా కొనసాగుతుంది. అధికారంలో ఉంది. కచ్చితంగా 8 నుంచి 10 స్థానాలు ఈజీగా కాంగ్రెస్‌ కైవసం చేసుకునే వీలుంది. ఇటు బీజేపీ, అటు బీఆరెస్‌ తండ్లాడినా ఈ మిగిలిన స్థానాల్లోనే కొట్టుకోవాల్సిందే. దీనికి విరుగుడుగా కేటీఆర్‌ ‘తారక’ మంత్రం ప్రయోగించాలని చూస్తున్నారు. అదే బీజేపీతో పొత్తు.

కలిసి పోటీ చేస్తే చెరో ఐదు చొప్పున ఈజీగా గెలిచి కొంచెం గౌరవ ప్రదంగా ఉంటామనే అభిప్రాయంతో కేటీఆర్‌ ఉన్నాడు. కానీ ఈ విషయం ఇంకా కేసీఆర్‌ దాకా పోలేదు. పోతే ఆయన ఒప్పుకుంటాడనే నమ్మకమూ లేదు. ఇదంతా ఒకెత్తయితే.. అసలు బీజేపీ వీరి స్నేహహస్తాన్ని స్వీకరిస్తుందా..? కేసీఆర్‌ను నమ్ముతుందా.? అనేది మరో ప్రధాన డౌట్‌. మొత్తానికి ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

You missed