బోధన్‌ బీఆరెస్‌లో అలజడి మొదలయ్యింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పద్మావతి ఆమె భర్త, కౌన్సిలర్‌, సీనియర్ బీఆరెస్‌ నాయకుడు తూము శరత్‌రెడ్డి తన అనుచరగణంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నాడు. తనతో పాటు పది మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో ఎంఐఎం పార్టీకి చెందిన కౌన్సిరల్లు కూడా ఉన్నారు. పలువురు సర్పంచులు, ఇతర నాయకగణం శరత్‌రెడ్డి వెంట కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

గత కొంతకాలంగా బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌కు శరత్‌రెడ్డికి మధ్య అసలు పొసగడం లేదు. ఏవో కారణాల చేత షకీల్‌.. శరత్‌రెడ్డిని దూరం చేసుకున్నాడు. శరత్‌రెడ్డి సైతం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. షకీల్‌ ఎంఐఎంతో కూడా కయ్యానికి కాలు దువ్వాడు. దీంతో వారు కూడా శరత్‌రెడ్డి పంచన చేరారు. వీరందరినీ తీసుకుని కాంగ్రెస్‌లో చేరుతున్నానని, షకీల్‌ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని శరత్‌రెడ్డి బాహాటంగానే ప్రకటించారు. ఎమ్మెల్సీ కవిత మధ్యవర్తిత్వం కూడా పనిచేయలేదు.

ఆయన ఎవరి మాట వినలేదు. పొంగులేటి శ్రీనివాస్‌తో మంతనాలు జరుపుకున్న శరత్‌రెడ్డి.. సోమవారం తన టీమ్‌తో గాంధీభవన్‌కు బయలుదేరి వెళ్లాడు. బోధన్‌ బీఆరెస్‌లో ఇదో రాజకీయ అలజడి సృష్టించనుంది. వాస్తవంగా అక్కడ మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి గెలుపు అంత ఈజీగా లేదు. కానీ శరత్‌రెడ్డి రాకతో కాంగ్రెస్‌ పార్టీ మరింత బలపడే అవకాశాలున్నాయి.