ఎన్వీ రమణ.సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి. తెలుగువాడు. పూర్వశ్రమంలో జర్నలిస్టు. ఆయన పదవీ విరమణకు రెండు రోజుల ముందు హైదరాబాద్లో పద్నాలుగేళ్ల సుధీర్ఘ కాలంగా కోర్టులో పెండింగ్లో ఉన్న ఇంటి స్థలాల అంశం చర్చకు వచ్చింది. ఆయన ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిపి జర్నలిస్టులకూ ముడిపెట్టి వీరికి ఇంటి స్థలాలు అవసరమా ..? అని వేసిన పిటిషన్పై ఆయన తనదైన శైలిలో పరిష్కారం చూపారు. ఎంపీలు, ఎమ్మెల్యేల ఇంటి స్థలాలకు .. జర్నలిస్టుల ఇంటి స్థలాలకు ముడిపెట్టొద్దు… జర్నలిస్టులు పేదవారు.. వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలి అని తీర్పు వెలువరించారు.
పద్నాలుగేళ్లు సుధీర్ఘంగా ఎదురుచూపిన ఎదురుచూపులకు తెర దింపారు ఎన్వీ రమణ.. ఈ తీర్పు కేవలం 2008లో ఏర్పడ్డ జవహార్ లాల్ హౌజింగ్ సొసైటీకి చెందిన 1200 మంది జర్నలిస్టులకు వర్తించేదే… దీన్ని అందరికీ ఆపాదిస్తూ జర్నలిస్టు యూనియన్ నేతలు ఆశలు పెట్టి భ్రమల్లో ముంచుతున్నారు. ఇది వేరే విషయం. అయితే దీనిపై సీనియర్ జర్నలిస్టు ఓరుగంటి సతీశ్ ఓ ఆర్టికల్ రాశాడు నమస్తే ఎడిటోరియల్ పేజీలో. అంతా కేసీఆర్ మయం అంటూ. అందులో ఎక్కడా ఎన్వీ రమణ ప్రస్తావన తేలేదు. ఈ తీర్పు వెలువడడానికి కారణమే ఆయన. ఆయన లేకపోతే ఇదింకెన్ని ఏళ్లు సుప్రీం కోర్టులో మురిగిపోయేదో..? ఇప్పుడాయన ఆ 1200 మంది జర్నలిస్టులకు దేవుడు. కానీ మన మిత్రుడి ఆర్టికల్లో ఎక్కడా రమణ పేరు లేదు. మీరు గొప్ప జర్నలిస్టు అయివుండీ ఇలా అసలు విషయాన్ని పక్కదో పట్టిస్తే ఎలా సతీషూ….!!