వరి రాజకీయం మున్ముందు రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేలా ఉంది. సీఎం కేసీఆరే స్వయంగా మహాధర్నాకు దిగాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి. కేవలం ఇదంతా కేసీఆర్ స్వయంకృతాపరాధమే. అవును.. గొప్పలు పోయి ఏతులు చెప్పుకున్నారు. కాళేశ్వరం జలాలు వచ్చాయి. వరి వేసుకోండి.. పెంచండి విస్తీర్ణం.. ప్రతీ గింజా మేమే కొంటాం అని డాంభీకాలు పలికాడు. నేతలంతా పొల్లుపోకుండా ఇదే ప్రచారం చేస్తూ వచ్చారు. తీరా అది తలకు మించిన భారంలా మారింది. కొనలేని పరిస్థితి ఉంది.
అసలు కేంద్రం ఊసులేకుండానే మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఇదంతా కొటుందని, దీని కోసం రుణాలు తీసుకుని మరీ మద్దతు ధర ఇస్తున్నదని బిల్డప్ ఇచ్చింది. నిన్న ఈటల రాజేందర్ ఇదే చెప్పాడు. కేంద్రం పేరు లేకుండా అంతా తానే అన్నట్టు.. తనకే పేరంతా రావాలన్నట్టు కేసీఆర్ చేసుకున్న గొప్పల ప్రచారం ఇప్పుడు ఆ పార్టీ పుట్టి ముంచనుంది. అవును…. ఇప్పుడు కేంద్రం కొనడం లేదు.. అందుకే యాసంగిలో వరి వేయకండి అని రైతుల గదవ పట్టి మరీ బతిమాలుకుంటున్న కేసీఆర్.. ఆనాడు ఎందుకు ప్రతీ గింజా మేమే కొంటామని తప్పుడు ప్రచారం చేసుకున్నాడు.
కేంద్రం కొనకపోతే.. కేసీఆర్ కొనాలి. మాకు మోడీ మీద, కేంద్రం మీద నమ్మకం లేదు.. కేసీఆర్ మీదే నమ్మకం.. కాబట్టి యాసంగిలో వరే వేస్తాం.. కొంటారా..? చస్తారా..? అని రైతు బరిలోకి దిగితే కేసీఆర్ పరిస్థితి ఏందీ..? ఇప్పుడు అదే జరగబోతుంది. వరి కొనడంలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర మధ్యవర్తిత్వమే. కానీ అంతకు మించి ఏదో బిల్డప్ ఇవ్వాలని చూసి.. ఇగో ఇలా ఇప్పుడు కొత్త రాజకీయ వేషం వేసి మహాధర్నాలు చేపట్టి… కేంద్రంపై సాకులు నెట్టి.. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది కేసీఆర్ సర్కార్. కానీ రైతులతో పెట్టకున్న మోడీలాగే కేసీఆర్ కూడా ఈ ఇష్యూలో చిత్తు కాక తప్పదు. పశ్చాత్తాపం చెందక తప్పదు.