ప్రింట్ మీడియా పరిస్థితి చివరికి ఇలా తయారయ్యింది. కరోనా ఎంటరైన తర్వాత ఇది ఇంకా ఘోరంగా తయారయ్యింది. ఉద్యోగాలన్నీ పీకేశారు. ఉద్యోగులను రోడ్డున పడేశారు. ఈ పత్రిక ఆ పత్రికని కాదు. నమస్తే తెలంగాణ నుంచి మొదలుపెడితే ఈనాడు వరకు. అన్ని పత్రికలవీ అదే దారి. పత్రిక సర్క్యూలేషన్ దారుణంగా పడిపోయింది. చదివే వారు లేరు. ఇంటికి పేపర్ వేయించుకోవాలనే ఆలోచన మానేసుకున్నవారెందరో. అంతా డిజిటిల్ మీడియా వైపే పోతున్నారు. సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు.
ఈ గడ్డు పరిస్థితుల్లో పత్రిక మనుగడ ఎలా? సర్క్యూలేషన్ పెంచుకోవడమెలా? తీవ్రంగా ఆలోచించగా.. చించగా… పత్రిక రేటను సగానికి అమ్మేద్దామని డిసైడ్ అయ్యాయి మేనేజ్మెంట్లు. ఏడాదికి 1200 కడితే చాలు … సగం ధరకే ఏడాది పొడుగునా పేపర్ వేస్తామని చెప్పుకుంటున్నాయి. ఇలా చెప్పగానే పాపం.. జనాలు ఎగబడి వేసేసుకుంటారనుకున్నారా? అంత సీన్ లేదు. ఈ టాస్క్ మళ్లీ విలేకరులకు అప్పగించాల్సిందే. టార్గెట్లు పెట్టి పేపర్ల సంవత్సర చందా చేయాల్సిందే. బలవంతంగా బెదిరించైనా వారికి అంటగట్టాల్సిందే. ఆ తర్వాత ఆ పేపర్లు సరిగ్గా పడుతున్నాయా? పడినా ఆ పత్రికలను చదువుతున్నారా? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దొరకవు.