వరిసాగు నుంచి క్రమంగా రైతును ఇతర పంటల వైపు మళ్లించేందుకు సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోమని చెప్పడంతో యాసంగి సీజన్లో వరి సాగుచేస్తే ధాన్యం కొనుగోలు చేయమనే సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి. గతంలో ఈ విషయం చెప్పినా.. రైతులు వినలేదు. కానీ ఈసారి బంతి కేంద్రం ఖాతాలోకి తోసేసే రాష్ట్రం రైతులను వరి సాగు నుంచి దూరం చేసేందుకు యత్నిస్తున్నది. అష్టకష్టాలు పడుతున్నది. యాసంగిలో వరిసాగు మొత్తమే వేయొద్దని, వేస్తే సన్నరకాలు వేయాలని లేదంటే ఆరుతడికి వెళ్లాలని రైతులకు అవగాహన కల్పించనుంది. ఈనెల 24 నుంచి రైతు వేదికల్లో రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది.
వారానికి రెండు సార్లు శుక్ర, మంగళవారాల్లో క్లస్టర్ల వారీగా ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వ్యవసాయ, ఉద్యానవన, శాస్త్రవేత్తలు తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆల్టర్నేట్ పంటల సాగు గురించి వివరిస్తారు. మెల్ల మెల్లగా రైతును వరి నుంచి దూరం చేయాలనే ఆలోచనలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కానీ రైతులు ఎంత వరకు ఈ విధానాన్ని ఒప్పుకుంటారు? సన్నరకాలు వేసి గతంలో చేతులు కాల్చుకున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా వస్తుంది? ప్రత్యామ్నాయ పంటల వైపు ఎంత మేర ఇంట్రస్ట్ చూపుతారు..? అనేది అంచనా వేయలేకపోతున్నారు అధికారులు. మొత్తానికి ఈ యాసంగి సీజన్ ప్రారంభం నాటికి రైతులను వరివైపు పోనీయకుండా పూర్తిగా కట్టడి చేయాలని సర్కార్ భావిస్తోంది. కానీ అది అంత తొందరగా సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు.