దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి:
ఉద్యోగ సంఘం నేతల ముసుగులో పదేళ్లు వారిదే రాజ్యం నడిచింది. ఉద్యోగ సంఘం నేతల్లా కాకుండా వారో రాజకీయ నాయకుల్లా చెలామణి అయ్యారు ఈ పదేళ్లు. గులాబీ నేతలను ప్రసన్నం చేసుకుని కావాల్సిన ఫైరవీలు చేసుకున్నారు. ఉద్యోగాలు చేయడమటుంచి.. రాజకీయ నాయకులకు తామేమీ తీసి పోమన్నట్టు నడిపించుకున్నారు. అంతా తాము చెప్పిందే నడవాలి. అవసరమైతే ఉన్నతాధికారులనూ హడలిత్తేంచే సత్తా వారిది. అంతా ఏకచత్రాధిపత్యం ఇన్నాళ్లు. కాలం మారింది. పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ఉద్యో్గ సంఘాల ప్రక్షాళనపై పడింది. ఫక్తు రాజకీయ పార్టీ అనుబంధ సంఘాలుగా మారిన టీఎన్జీవో, టీజీవోల కమిటీలన్నీ రద్దు చేసేసింది. మళ్లీ కొత్తగా సభ్యత్తం చేయించి, ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.
దీంతో ప్రస్తుతం ఇదే టాపిక్ ఉద్యోగుల్లో, ఉద్యోగ సంఘాల నేతల్లో హాట్ టాపిక్గా మారింది. గడిచిన పదేళ్లు తమకు తిరుగులేకుండా నడిపించుకున్న నేతలకు ఈ పరిణామం ఆందోళన కలిగించేది. కొందరు మొదట్నుంచే కాంగ్రెస్ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. మళ్లీ మాకు పాత జిల్లే కావాలి. అక్కడే కొనసాగాలి. బదిలీ చేయొద్దు. నేతగా ఉండాలి. ఇదే వారి కోరిక. దీని కోసమూ ఫైరవీ చేస్తున్నారు. వారికి ఆ అధికారం అంతలా కలిసివచ్చింది మరి. అందుకే ఒక పట్టాన వదల్లేకపోతున్నారు. కానీ, రేవంత్ సర్కార్ ఇంతవరకూ ఉన్న టీఎన్జీవో, టీజీవో నేతలను స్వీకరించే పరిస్థితిలో లేదు. తమకు కొత్త టీమ్ కావాలని కోరుకుంటోంది. అందుకే నెల రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.