అర్వింద్ను నిజామాబాద్ నడి బజారులో చెప్పుతో కొడతానన్నారు ఎమ్మెల్సీ కవిత. బహుశా ఇంత పరుష పదజాలం ఆమే ఏనాడూ వాడి ఉండదు. అంతలా కోపం తెప్పించింది నిజామాబాద్ ఎంపీ అర్వింద్ వైఖరి. అసలు అర్వింద్ ఎవరు..? అతను రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చాడు…? రాగానే ఉత్తి పుణ్యానికే ఎంపీ అయిపోయాడా..?? గెలిచిన తర్వాత ఎందుకు అంతలా రెచ్చిపోయాడు..?? పేట్రేగిపోతున్నా పట్టించుకోకుండా దిక్కులు చూసిందెవ్వరూ..?. ఇంతలా అర్వింద్ను పెంచి పోషించిందెవ్వరూ…?? అన్నింటికీ ఒక్కటే సమాధానం. టీఆరెస్.. టీఆరెస్… టీఆరెస్…….
అవును…. అర్వింద్ను తక్కువ అంచనా వేశారు. కవిత చుట్టూ ఓ కోటరీ అప్పటికే గోటలు కట్టేసుకుని … అభూతకల్పనలను, భ్రమలను నిజాలుగా చెప్పి ఆమెను వాస్తవ లోకానికి దూరం చేశారు. అన్ని వర్గాల దరి చేరకుండా ఆ కోటరీ పాగా వేసి ఆమెకు రాజకీయంగా నష్టం చేశారు. నేతల మధ్య సమన్వయం కొంప ముంచింది. ఇవన్నీ ఓటమి తర్వాతైనా ఒప్పుకోవాలె….కదా..! ఒప్పుకోలేదు. వాస్తవాలు తెలుసుకోలేదు. వాస్తవ దూరంగానే ఉన్నారు. ఒక్కసారి దెబ్బతిన్నతర్వాత మేల్కోవాలి. కానీ ఇక్కడ టీఆరెస్ మేలుకోవడం కాదు కదా.. కనీసం కోలుకోలేదు.
అర్వింద్ ఇదే అదనుగా భావించాడు. తన నోటి వాగ్దాటిని కొనసాగించాడు. నేతల మధ్య సమన్వయలేమిని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఇష్టమొచ్చినట్టు వాగుతున్నా… ఎవ్వరూ పట్టింపులేదు. కౌంటర్ ఇద్దామన్నా..ప్రెస్మీట్ పెట్టాలన్నా … ఎవరిదో ఆదేశం రావాలి.. ఎవరి నుంచో పర్మిషన్ కావాలి. ఎవరికీ ఎలాంటి బాధ్యతలు లేవు. పదవులు లేవు. పార్టీ పదవులు అసలే లేవు. పార్టీ నిర్మాణం ఎక్కడో.. ఎప్పుడో ఆగిపోయింది. కేటీఆర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అసలు పార్టీ పూర్తిగా అదుపు తప్పింది. ఉద్యమకారులను పట్టించుకున్నవాడు లేడు. వారిని కనీసం మర్యాదిచ్చి పిలిచి మాట్లాడినోడూ లేడు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీఆరెస్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఘోర పరాజయం. ఇప్పుడు అందరినీ పార్టీకి తీసుకుంటున్నారు గానీ….టీఆరెస్కు నిజామాబాద్ అర్బన్లో గట్టి దెబ్బే తగిలింది. ఎవరు కారణం…? నేతలే. కవిత పట్టించుకోలేదు. కనీసం దరిదాపుల్లోకి రాలేదు. ఓడిపోతే ప్రజాలకు దూరంగా ఉండాలా..? అనే అభిప్రాయం సర్వత్రా వినిపించినా ఎవ్వరూ పట్టించుకోలేదు.
పరిగణలోకి తీసుకోలేదు. కవిత ఒక్క పిలుపిస్తే దాన్ని అందుకోవడానికి ఓ సైన్యం ఉంది. ఇందూరు గులాబీ దళం ఉంది. కానీ ఆమె మౌన ముద్ర ఆ సైన్య వీరావేశాన్నీ నిర్వీర్యం చేసింది. దీంతో మనకెందుకులే అని ఎవరి జాగలో వారు కూర్చుని తమాషా చూశారు. అర్వింద్ వేశాలు విచ్చలవిడిగా సాగాయి. నోటికి అదుపు లేదు. మాటలకు కంట్రోల్ లేదు. దీన్ని జనాలూ విస్తుపోయి చూశారు. కానీ కౌంటర్ లేదు. ప్రతిదాడి లేదు. మాటకు మాట జవాబు లేదు. నిరసన లేదు. నిలదీత లేదు. ప్రెస్మీట్ లేదు. జిల్లాకు అధ్యక్షడూ లేడు. ఇదీ పరిస్థితి.
గోటితో పోయేదాన్నిగొడ్డలిదాకా తెచ్చుకుంది మీరు కాదా..? ఇప్పుడు చెప్పుతో కొడతాననే పరిస్తితీ తెచ్చుకుంది మీరు కాదా…?
ఇది స్వయం కృతరాధమా కాదా..??
ఒప్పుకుంటారా..?? ఆత్మపరిశీలన ఉంటుందా..??