ఆసరా కొత్త పింఛన్లు ఇవ్వడంతో ప్రభుత్వం వద్ద తీవ్ర జాప్యం జరగుతోంది. నిధుల లేమి ఆసరాకు ఆది నుంచి ఆటంకంగా మారింది. గత మూడేండ్లుగా కొత్త పింఛన్ ఊసేలేదు. భర్తలు కోల్పోయిన వితంతులు ఈ పింఛన్ల కోసం కండ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. ప్రతీనెలా పింఛన్ దారులు చనిపోతున్నా.. వారి లిస్టులోనైనా కొత్తవారికి అవకాశం ఇవ్వడం లేదు సర్కార్. ఉన్న పింఛన్దారుల సంఖ్య తగ్గిపోతూ .. ప్రభుత్వానికి కొంత భారం తగ్గుతున్నా… కొత్త వాటి గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. ఏదో ఒక మీటింగులో ఎవరో ఒక మంత్రి ఈ పింఛన్ల మీద కామెంట్లు చేస్తూనే ఉన్నారు. వచ్చే నెల ఇక కంపల్సరీగా కొత్త పింఛన్లు వస్తాయి… అంటూ ప్రకటనలిస్తున్నారు. కానీ అవి ప్రకటనలకే పరిమితమయ్యాయి. అమలు చేసే నాథుడు లేడు. అక్కడ పైన సీఎం కేసీఆర్ అనుకుంటేనే ఇది సాధ్యమయ్యేది. అది అందరికీ తెలుసు. కానీ ఆయన మాత్రం దీనిపై పెద్దగా ఇంట్రస్టు చూపడం లేదు. ఎందుకంటే వచ్చే ఆదాయం రైతుబంధు, జీతాలకు సమకూర్చడానికే సరిపోవడం లేదు. ఇక కొత్త పింఛన్ల జోలికి ఎలా వెళ్లడం..?
కానీ మొన్నటికి మొన్న మంత్రి కేటీఆర్ ఈ కొత్త పింఛన్లపై స్పందించాడు. వచ్చేనెల అంటే ఆగస్టు మాసం నుంచి దరఖాస్తు చేసుకుని అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించగానే మళ్లీ చాలా మంది ఆశలు చిగురించారు. మంత్రి కేటీఆరే చెప్పాడంటే ఇక ఆగవు కావచ్చని అనుకున్నారు. కచ్చితంగా వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు వస్తాయని అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ ఫైలు ఇక ఇంచుకూడా కదలింది లేదు. సీఎం కేసీఆర్ వద్ద అలాగే ఉంది. దానికి అతీలేదు గతీ లేదు. దీంతో వచ్చే నెల కూడా కొత్త పింఛన్లు రావనేది స్పష్టమయ్యింది. రామన్న చెప్పినా సర్కార్లో కదలికలేదు.. పనులు సాగడం లేదనే ప్రచారం ఉంది. ఇదీ ఆ వరుసలోకే చేరింది.