‘వాస్తవం’ ముందే చెప్పింది. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో కాంగ్రెస్ లోపాయికారిగా సహకరించింది. ఇక్కడ కవితను ఓడగొట్టడమే కాంగ్రెస్ ధ్యేయం. ఎలాగూ తను గెలవదు. కానీ కవితను గెలనివ్వొద్దు. బీజేపీకి సపోర్టు చేయాలె. అందుకే మధుయాష్కీ అక్కడ పెద్దగా ప్రచారం చేయలేదు. అసలు పోటీలో ఉన్నాడా..? అనే అనుమానం వచ్చింది చాలా మందికి. చివరకు అనుకున్నది సాధించారు. కవిత ఘోర పరాభవం మూటగట్టుకున్నది. ఈ ఓటమి ఆమె రాజకీయ జీవితంపైనే తీవ్ర ప్రభావంచూపింది. అర్వింద్ గెలుస్తాడా..? అని అనుకున్నోళ్లంతా ముక్కున వేలేసుకున్నారు.
ఇక్కడ హుజురాబాద్లో అదే జరిగింది.ఇది ఈటల రాజేందర్కు, సీఎంకు మధ్య పోటీగా చూసింది కాంగ్రెస్. కాంగ్రెసే కాదు.. అంతా అలాగే చూశారు. అందుకే దీనికంత హైప్. దీనికి తోడు సీఎం కేసీఆర్ కూడా దీనిపై గట్టిగానే నజర్ పెట్టాడు. సీఎం హోదాను మరిచి మరీ దిగజారి ప్రవర్తించాడు. అందరినీ ఎడాపెడా చేర్చుకున్నాడు. పదవులిస్తానని ఆశచూపాడు. ఎలాగైనా గెలవాలనే తలంపుతో ఏవేవో అనవసర హామీలిచ్చాడు. నాయకులకు ఆశ పెట్టాడు. కానీ ఇక్కడ కాంగ్రెస్… కేసీఆర్ ఓడాలని చూసింది. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రం పాటించింది. ఈటలకు సపోర్టు చేసింది. డమ్మీ క్యాండేట్ను నిలబెట్టింది. ప్రచారం చివరలా అలా తూతూ మంత్రంగా చేసంది. మొత్తానికి అనుకున్నది సాధించింది. ఈటలను గెలిపించుకున్నది కాంగ్రెస్.
ఒకవేళ కాంగ్రెస్ గట్టిగా ప్రచారం చేస్తే.. దాని సంప్రదాయక ఓటు బ్యాంకుతో పాటు .. రేవంత్ వచ్చిన తర్వాత వచ్చిన ఊపు కొంత కలిసివచ్చేది. కానీ గెలుపు మాత్రం సాధ్యం కాకపోయేది. మరి గెలిచే అవకాశమే లేనప్పుడు అనవసరంగా ఓట్లు చీల్చి పరోక్షంగా టీఆరెస్ గెలుపుకు ఎందుకు దోహదపడాలనేది కాంగ్రెస్ వ్యూహం. అదే ఆలోచన, వ్యూహంతో ముందుకు సాగారు. ఈటలను గెలిపించుకున్నారు. నిజామాబాద్లో కవితను ఓడగొట్టారు. ఇక్కడ ఈటలను గెలిపించుకున్నారు. రెండు చోట్ల కేసీఆర్పై కసి తీర్చుకున్నారు.