బీజేపీ,కాంగ్రెస్‌లు ఉత్త‌ర ద‌క్షిణ ద్రువాలు. సైద్దాంతికంగా పూర్తి భిన్నం. ఉప్పూ నిప్పు.. ఇవ‌న్నీ ప్ర‌ధాన ఎన్నిక‌ల్లో. కానీ కొన్ని లోక‌ల్ ఎన్నిక‌ల్లో ఈక్వేష‌న్లు మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు ఈ రెండూ ఒక్క‌ట‌వుతాయి. అనుకున్న గోల్ కోసం తెర వెనుక క‌లిసి ప‌నిచేస్తాయి. ప‌రోక్షంగా ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకుంటారు. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులుండ‌రంటారు. అలా అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఒక‌రి అవ‌స‌రాల కోసం ఒక‌రు స‌హ‌క‌రించుకుంటూ ఉంటారు.

ఇప్పుడిదంతా ఎందుకంటే.. హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో మ‌రోసారి ఇది రిపీట్ కాబోతుంది. అచ్చం మొన్న‌టి పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో నిజామాబాద్‌లో జ‌రిగిన‌ట్టుగా. బీజేపీ ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న ధ‌ర్మ‌పురి అర్వింద్‌కు .. కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి మ‌ధుయాష్కీ గౌడ్ పూర్తిగా స‌హ‌క‌రించాడు. ఇక్క‌డ టీఆరెస్ అభ్య‌ర్థిగా ఉన్న క‌విత‌ను ఓడించేందుకు ఇద్ద‌రూ ఒక్క‌టి కావాల‌నుకున్నారు. తెర వెనుక ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకున్నారు. అందుకే కాంగ్రెస్‌కు అంత‌కు ముందు వ‌చ్చిన ఓట్ల‌లో స‌గం కూడా రాలేదు. క‌విత‌ను ఓడించ‌డ‌మే కాంగ్రెస్ కోరుకున్న‌ది. బీజేపీకి స‌పోర్ట్ చేసింది. అనుకున్న‌ది సాధించింది కాంగ్రెస్‌. ఇద్ద‌రి మ‌ధ్య బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డ‌ది బీజేపీ.

ఇప్పుడు హుజురాబాద్‌లో ఇదే ఈక్వేష‌న్ ప్ర‌యోగిస్తున్న‌ది కాంగ్రెస్‌. ఎలాగూ ఇక్క‌డ నుంచి పోటీ చేసి గెలిచేది లేదు. అందుకే ఈట‌ల రాజేంద‌ర్‌కు స‌పోర్టు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ది. అందుకే ఇక్క‌డ నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా డ‌మ్మీ క్యాండెట్ ఉండ‌బోతున్నాడు. పెద్ద‌గా ప్ర‌చారం ఉండ‌దు. ఖర్చూ ఉండ‌దు. ఈ ప‌రిణామాలు ప్ర‌జ‌లు ఈజీగా అర్థం చేసుకుంటారు. అందుకే వారికి రెండే పార్టీలు క‌నిపిస్తాయి. ఒక‌టి టీఆరెస్‌, మ‌రొక‌టి బీజేపీ. ఈ రెండిట్లో దేనికి వేయాలి..? అనే ఆలోచ‌న త‌ప్ప‌. కాంగ్రెస్‌కు వేయాలి అనే థాట్ రాదు. అలా రానీయ‌కుండా కాంగ్రెస్ నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న‌మాట‌.

మ‌రి.. దాని ఇలా చేస్తే లాస్ కాదా..? ప్ర‌జ‌ల్లో ప‌ర‌ప‌తి మ‌రింత స‌న్న‌గిల్ల‌దా? అంటే.. అదేం లేద‌ని భావిస్తున్న‌ది కాంగ్రెస్‌. ఎందుకంటే.. ఈ ఎన్నిక ఈట‌ల రాజేంద‌ర్‌, కేసీఆర్ మ‌ధ్యే. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రికి ఓటేయాలో ప్ర‌జ‌లు తేల్చుకునే సంద‌ర్భం. మ‌ధ్య‌లో కాంగ్రెస్‌ను ప‌ట్టించుకునేవారు ఉండ‌రు. అలా అని వ‌చ్చే ఎన్నిక‌ల్ల్ కూడా ఇదే విధంగా జీవం లేకుండా చేవ‌చ‌చ్చిన పార్టీలా ఏమీ ఉండ‌దు. ఇప్ప‌టికే ఇది పుంజుకుంటున్న‌ది. అప్ప‌టి వ‌ర‌కు మ‌రింత దూకుడు పెంచుతుంది. దీని టార్గెట్ జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్‌. దాని వైపే చూపు. మ‌ధ్య‌లో వ‌చ్చిన ఈ హుజురాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు ఆట‌లో అర‌టిపండు. అంతే..!