చదువుల్లో మన చంటోళ్లు వెనుకబడుతున్నారు. అమ్మాయిలకు అరకొర చదువులు చెప్పించి.. ఎప్పుడు పెండ్లి చేసి భారం దింపుకుందామా.? అని చూసే తల్లిదండ్రులకు మేం ఎంత బాగా చదువువతామో చూశారా అని నిరూపించుకుంటున్నారు అమ్మాయిలు. మగ పోరగాళ్లంటే తల్లిదండ్రులకు అమితమైన గారాభం. వారికెంతో స్వేచ్చనిస్తారు. అడిగిన డబ్బులిస్తారు. విచ్చలవిడితనాన్ని పెంచుతారు. అదే అమ్మాయిలైతే అన్నీ ఆంక్షలే. కానీ ఆ ఆంక్షలు తమ చదువుకు మాత్రం ఆటంకం కాలేదు. అబ్బాయిలు చదువుల్లో మొద్దుసుద్దలని తేలితే… అమ్మాయిలు మాత్రం గోల్డ్ అని నిరూపించుకున్నారు.
ఉన్నత విద్య చదవడంలో అమ్మాయిలు, అబ్బాయిలతో పోటీ పడుతున్నారని, వారి కంటే ఎక్కువ విజయాలు సాధిస్తున్నారని ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ అన్నారు. వర్సిటీ 2018 -20 విద్యా సంవత్సరాలకు సంబంధించి మొత్తం 80 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో గోల్డ్మెడల్స్ సాధించగా, వారిలో అత్యధికంగా 85 శాతం అమ్మాయిలే (68 మంది) పొందారని తెలిపారు. అబ్బాయిలు 12 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. అలాగే 343 పీహెచ్డీ అవార్డు పొందే వారిలో 148 మంది అమ్మాయిలేనని పేర్కొన్నారు. ఎంటెక్, ఎంఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈసెట్-21లో 72 వేల మంది పరీక్షకు హాజరైతే..వారిలో 50 వేల మంది వరకు బాలికలే ఉన్నట్లు వివరించారు.
ఉస్మానియా యూనివర్సిటీలోని గెస్ట్హౌస్లో నిర్వహించిన యూనివర్సిటీ 81వ స్నాతకోత్సవ సన్నాహాక సమావేశంలో వీసీ మాట్లాడుతూ.. 750 మంది స్కాలర్లు పీహెచ్డీ సాధించగా, వారిలో ఇప్పటికే 350 మంది పట్టాలు స్వీకరించారు. మొత్తం 80 మంది గోల్డ్ మెడల్స్కు ఎంపికైనట్లు చెప్పారు. 27న స్నాతకోత్సవం నిర్వహిస్తున్నారు.. ఇదీ సంగతి. మగపోరగాళ్లకు తిరుగుళ్లు ఎక్కువయ్యాయి. చదవుపై శ్రద్ద తగ్గింది. మందులు, మజాలకే ఎక్కువ టైమ్ ఇస్తున్నట్టున్నారు. అందుకే ఇలా చదువుల్లో వెనకబడి తల్లిదండ్రులు తమమీద చూపిన అపార గారాభానికి ప్రతిఫలాలను అందిస్తున్నారు.