లక్షమంది బీడీ కార్మికులు జీవనభృతి కోసం ఎదురుచూపులు…
పీఎఫ్ కటాఫ్ డేట్ ఎత్తేసి .. అందరికీ ఆసరా పింఛన్ ఇస్తామన్న సర్కార్…
జీవో వచ్చి పదినెలలైనా ఇంకా అమలు కాని వైనం….
కలెక్టరేట్ చుట్టూ తప్పని ప్రదక్షణలు.. ప్రభుత్వ నిర్ణయం కోసం ఆగని పడిగాపుల నిరీక్షణలు…
“ఎన్నాళ్ల నుంచో ఆసరా పింఛన్ కోసం ఎదురు చూస్తన్న బీడీ కార్మికులకు ఇది శుభవార్త. ప్రభుత్వం బీడీ కార్మికులకు జీవన భృతి కింద ఆసరా పింఛన్ను అందిస్తున్నది. దీనికి మొన్నటి వరకు ఓ కటాఫ్ డేట్ను పెట్టింది. 2014 ఫిబ్రవరి 28 లోపు పీఎఫ్ నెంబర్ కలిగి ఉన్నవారు మాత్రమే బీడీ పింఛన్కు అర్హులు. మొన్నటి వరకు వారే ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పంద్రాగస్టు రోజున రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ 10 లక్షల మంది కొత్త వారికి ఆసరా పింఛన్ మంజూరు చేసిన వాటిల్లో బీడీ కార్మికులు కూడా ఉన్నారు.
అయితే ఆ కటాఫ్ డేట్ మూలంగా చాలా మంది కొత్త వారికి బీడీ కార్మికుల జీవన భృతి చేరడం లేదు. వారు అర్హుల కిందకు రావడం లేదు. చాలా రోజులుగా వివిధ పార్టీలు, మహిళలు, కమ్యూనిస్టు పార్టీలు దీనిపై ఆందోళనలు చేస్తూ వస్తున్నాయి. పీఎఫ్ నెంబర్ ఉన్న ప్రతీ ఒక్కరికీ పింఛన్ అందివ్వాలని వారు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణిలో దీనిపైనే అత్యధిక ఫిర్యాదులు వచ్చేవి. కలెక్టర్లు కూడా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నారు.”
ఇది ఓ పది నెలల క్రితం వాస్తవం రాసిన వార్తాకథనం. బీడీ కార్మికులు పండుగ చేసుకున్నారు. మా కందరికీ ఇక బీడీ పింఛన్ వస్తుందని కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొట్టారు. కొత్త జీవో ప్రకారం పీఎఫ్ నెంబర్తో దరఖాస్తులు చేసుకున్నారు. అవి మొత్తం లక్షకు చేరుకున్నాయి. ఇందులో అత్యధికంగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లావే అత్యధికంగా ఉన్నాయి. ఇక్కడే ఎక్కువగా బీడీ చుట్టే కార్మికులున్నారు. ఇక రేపు మాపు అంటు అధికారులు చెబుతూ కాలయాపన చేస్తుండగా.. కలెక్టరేట్ చుట్టూ బీడీ కార్మికులు కాళ్లకు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. జీవో ఇచ్చి పదినెలల అయినా.. ఇంకా దీన్ని ప్రభుత్వం అమలు చేయకపోవడం పట్ల బీడీ కార్మికులు కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో .. మరో రెండు మూడు నెలల్లో బహుశా దీనికి మోక్షం లభించే అవకాశం ఉండొచ్చంటున్నారు.