మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం కొంత పుంతలు తొక్కుతున్నది. సోషల్ మీడియా దీనికి తోడుగా నిలుస్తున్నది. గ్రాఫిక్స్, మార్ఫింగ్స్.. తమకు నచ్చినట్టు…తోచినట్టు, జుగుప్సాకరంగా, వెటకారంగా, వెక్కిరింతగా… చిలిపిగా, చీపుగా… ఎలాగైనా ప్రచారం చేసుకోవచ్చు. ఆంక్షలు లేవు. పట్టింపు లేదు. పట్టించుకునే వాళ్లూ లేరు. గోడల మీద రాతలు, వాల్ పోస్టర్లు, వీటికి అదనంగా మార్ఫింగులతో కూడిన సోషల్ మీడియా పోస్టింగులు. ఎవరూ తగ్గడం లే. అందరిదీ అదే దారి. అంతా ఒక్కెత్తైతే ఇవాళ ఎవరో తమ ఫేస్బుక్ వాల్ మీద ఈ పోస్టులు పెట్టారు.
మునుగోడు ప్రజలారా..! మేము మోసపోయాం… మీరు మోసపోకండి – హుజురాబాద్ ప్రజలు
మునుగోడు ప్రజలారా..! మేము మోసపోయాం… మీరు మోసపోకండి – దుబ్బాక ప్రజలు
ఈ రెండు పోస్టర్లు వేర్వేరుగా ముద్రించి ఉప ఎన్నిక జరిగే ప్రాంతాల్లో అతికించినట్టుగా ఆ పోస్టింగులో కనిపించింది.
ఆ ఎన్నిక ఫలితాలనే తప్పుబట్టినట్టుగా.. ప్రజాతీర్పునే కించపర్చినట్టుగా ఉన్న ఈ ప్రచారంతో ఎంత మంది ప్రజల మనసు మార్చగలరు. వాళ్ల మనసు మార్చే ఎత్తుగడలో ఇది ఎవరు ముద్రించారో వారే మరింత చిత్తయిపోయే ప్రమాదం లేదా..?
ఇది ఏ పార్టీ ముద్రించి ప్రచారం చేస్తుందో అందరికీ తెలుసు. ఓటమిని అంగీకరించాలి. లోపాలేమిటో తెలుసకోవాలి. ఎన్ని పైసలు పంచినా… మరెన్ని ప్రలోభాలు పెట్టినా ఎందుకు ఓడాం..? ఎక్కడ తప్పు జరిగింది..? జనంలో ఎందుకు కోపం , వ్యతిరేకత ఉంది..? ఆ ఉప ఎన్నిక తీవ్రత ఎలాంటిది…? అని విశ్లేషించుకోవడం మానేసి….. ఇప్పుడు ఆ ఫలితాన్ని తీసుకొచ్చి మేము అప్పుడు తప్పుగా ఓటేశాం… ఇప్పుడు మీరూ ఆ పనిచేయకండి… అని… అదీ ఆ ప్రజలు అన్నట్టుగా ప్రచారం చేయడం ఎవరికి ఉపయోగమో…?
కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడిందంట.
ఆ ఉప ఎన్నికల్లో ప్రజలు ఆ అభ్యర్థుల్లే గెలిపించాలనుకున్నారు. గెలిపించారు. అంతే.
ఇక్కడ మీరు గెలిచేందుకు జనం మనసు గెలిచే ప్రయత్నం చేయండి… ఏమార్చే ప్రయత్నం కాదు…