నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై దాడి. ఆయన మీద దాడి జరగకున్నా.. ఎంపీ పర్యటనను టార్గెట్ చేసుకుని అనుచరులపై టీఆరెస్ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. ఇదిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్. బీజేపీ ఎంపీలపై దాడులు జరుగుతున్నాయి… ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది…. ఇది కొత్త సంస్కృతి… గతంలో ఎన్నడూ ఇలా లేదు.. ఇగో ఇలాంటి కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజమే. ఈ రోజు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో జరిగిన ఈ సంఘటన చాలా వైఫల్యాలనే బయటపెట్టింది. నేతల తప్పులను వేలెత్తి చూపింది. ఎవరిది తప్పు..? ఎందుకు తప్పు…? బీజేపీపై దాడి జరిగినా సానుభూతి లేదెందుకు..? మద్దతులేదెందుకు..?
– అర్వింద్ దుందుడుకు మనస్తత్వం.. నోటి దురుసు చాలా మందిలో ఏహ్యభావం పెంచింది. మొదట్లో అర్వింద్ మాటలను, తిట్లను ఎంజాయ్ చేశారు. పోను పోను అవి శ్రుతి మించాయి. రోత పుట్టేలా చేశాయి.
– సీఎంను ఎంత తిడితే అంత తనకు పొలిటికల్ మైలేజీ వస్తుందని అర్వింద్ భ్రమపడ్డాడు. అదే లోకంలో ఉన్నాడు. అదే పంథాలో పోతున్నాడు. వాడు వీడు.. ఒరేయ్..తురేయ్.. ఇంకా చాలా. ఇలాంటి మాటలు తన సభ్యత ఏ పాటితో తెలియజెప్పేలా చేసింది. విషయం మీద మాట్లాడే సందర్బాలు తక్కువ. మాల్ మసాల .. తిట్ల దండకం.. ఇదే అర్వింద్ మంత్రదండంగా భావించాడు.
– పసుపు బోర్డు హామీ, బాండ్ పేపర్ ఇష్యూ.. అతన్ని రైతుల్లోనే కాదు.. సామన్య ప్రజల్లో కూడా విశ్వసనీయత లేకుండా చేసింది.
– ప్రజల్లో పెరుగుతున్న ఈ వ్యతిరేకత టీఆరెస్ అనుకూలంగా తీసుకున్నది. దాడులకు కూడా దిగింది. మొన్న రూరల్ నియోజకవర్గం.. ఈ రోజు ఆర్మూర్ నియోజకవర్గం. ఇదిప్పుడు కొత్త ట్రెండ్. దీని వల్ల టీఆఎస్కు నష్టమే. దీన్ని పార్టీ హై కమాండ్ సమర్థిస్తుందని, మెచ్చుకుంటుందనే సిగ్నల్స్ వస్తే.. ఇక టీఆరెస్ లీడర్లు ఇదే పంథాను ఎంచుకుంటారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే సంస్కృతి మామాలైపోతుంది.
– ఇప్పటికే కేటీఆర్ ఈట్ కా జవాబ్ పత్తర్ సే అని ఉసిగొల్పాడు. యువనేత మెప్పు కోసం ఇలాంటి దాడులు చేసేందుకు గులాబీ నేతలు ఉత్సాహం కనబరుస్తారు. అంతిమంగా అది పార్టీకే నష్టం.
– లీడర్ల ఆధిపత్య పోరులో పోలీసులు నలిగిపోతున్నారు. వారి ప్రతిష్ఠ మసకబారుతున్నది. అధికార పార్టీ ఆలోచనలకు అనుగుణంగా పోవాల్పిందే. దాడి జరగాలంటే చూసీ చూడనట్టు ఉండాలె. మరి ప్రజలేమనుకోవాలి…?