హుజురాబాద్ ఉప ఎన్నికలో అనివార్యంగా టీఆరెస్ గెలవాల్సి ఉంది. లేదంటే ఆ పార్టీ పై ఈ ఓటమి తీవ్ర ప్రభావం చూపనుంది. అందుకే ఈ ఉప ఎన్నికను కేసీఆర్ ఇజ్జత్ కా సవాల్గా తీసుకున్నాడు. ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. ఈటలను ఓడగొట్టేందుకు టీఆరెస్ సర్వ శక్తులూ ఒడ్డుతున్నది. హరీశ్ రావు నెలలుగా అక్కడే తిష్టవేశాడు. మంత్రులు గంగుల, కొప్పుల ఈశ్వర్ అక్కడే తిరుగుతున్నారు.
దళితబంధు పథకం ఇక్కడే పైలట్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేశాడు కేసీఆర్. మ్యానిఫెస్టోలో ప్రకటించిన పథకాలకు ఈ వేదికగా కదలిక వచ్చింది. నిరుద్యోగ భృతి గురించి మాత్రం ఊసే లేదు. ఉద్యోగాల నోటిఫికేషన్ పై అలవాటైన దోరణిలో మళ్లీ అవే అబద్దాలు. అవే ప్రకటనలు. సీఎం స్థాయిలో హరీశ్ ఎడాపెడా హామీల వర్షం కురిపించాడు.
ఎలాగైనా గెలవాలి. గెలిచి బయటపడాలి. దీని కోసం ఏమైనా చేస్తాం.. ఎన్నైనా అబద్దాలాడతాం.. అనే విధంగా వ్యవహరించాడు హరీశ్. గతంలో ఎన్నడూ లేని విధంగా హరీశ్ తన శైలిని వీడి.. తన సహజ సిద్దమైన నడవడకను కాదని ఇక్కడ నడుచుకున్నాడు. విమర్శలపాలయ్యాడు. అయినా పట్టించుకోలేదు. గెలిచి రావాలనుకున్నాడు. అంతే. కేసీఆర్ కు హుజురాబాద్ను కానుకు ఇవ్వాలనుకున్నాడు. దాని కోసం ఆయన పండుగలు, పబ్బాలు, ప్లీనరీలు ఏదీ పట్టించుకోలేదు. దుబ్బాకలో పడిన కష్టానికి వెయ్యి రెట్లు ఇక్కడ కష్టపడ్డాడు. కానీ ఫలితం ఎలా ఉండబోతుంది..? టీఆరెస్ గెలుపు అంత ఈజీనా..? ఈటల గెలుపు నల్లేరు మీద నడకేనా.? అంటే కాదనే సర్వే రిపోర్టుల చెబుతున్నాయి. కానీ టీఆరెస్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నది. మనమే గెలుస్తున్నామని చెప్పుకుంటున్న లోలోన గులాబీ శిబిరంలో గుబులు రేగుతున్నది.
సీఎం కేసీఆర్ కు ఇప్పుడు హుజురాబాద్ ఫీవర్ పట్టుకున్నది. మొన్నటి ప్లీనరీలో కూడా హుజురాబాద్ గురించే ఆయన రంది కనబడ్డది. దుబ్బాకను కేసీఆర్ పట్టించుకోలేదు. అక్కడ సభ జరగలేదు. ఇక్కడ సభ జరగకున్నా.. కేసీఆరే అన్నీ తానై వ్యవహరించాడు. కేసీఆర్ దీన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు. ఇప్పుడు అదే సమస్యై కూర్చున్నది. గెలవకపోతే పార్టీ భవిష్యత్తును పణంగా పెట్టినవాడవుతాడు కేసీఆర్.
4