నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై బీజేపీ పార్టీ సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఏకపక్షంగా పదమూడు మంది మండల అధ్యక్షులను తొలగించి కొత్త వారిని నియమించడంతో అర్వింద్ ఆగడాలు పార్టీలో శ్రుతిమించి పోయాయని వారంతా భగ్గుమంటున్నారు. ఏకంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలోనే బైఠాయించి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తర్వాత ఎంపీ అర్వింద్ ఏమాత్రం జంకలేదు. సరికదా ఇది జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య చేసినదని తనకు సంబంధం లేదంటూ బుకాయించాడు. దీంతో మరింత భగ్గుమన్నారు బీజేపీ సీనియర్లు.
దీన్ని రాష్ట్ర పార్టీ అధిష్టానం కూడా సీరియస్గా తీసుకోకపోవడంతో వారి కోపం నశాళానికంటింది. అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యింది. దీంతో అసమ్మతి నేతలంతా జిల్లాలో ఒక్కటయ్యారు. అర్వింద్ ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుని నిరసనలు తెలపడానికి సిద్దపడ్డారు. జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల్లో సీనియర్ నేతలంతా అసమ్మతి దండుగా ఏర్పడ్డారు. నేడో రేపో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు స్కెచ్ వేసుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతున్న తరుణంలో అర్వింద్ వైఖరి, ఒంటెత్తు పోకడలు మరింత నష్టం చేస్తున్నాయని, సీనియర్లను పక్కన పెట్టడంతో వారు వేరే పార్టీలోకి వెళ్లలేక ఉన్న పార్టీలో ఆత్మగౌరవంతో బతకలేక నరకయాతన పడుతున్నారు.
దీంతో వీరంతా అసమ్మతి దండుగా ఏర్పడి.. అర్వింద్పై స్వపక్షంలోనే ఉంటూ తిరుగుబాటు బావుటా ఎగురవేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిరసనల ద్వారా పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు అధిష్టానానికి చేరవేసి అర్వింద్ పెత్తనాన్ని అణిచివేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఓ వైపు కాంగ్రెస్ పుంజుకుంటూ బీజేపీ గ్రాఫ్ పడిపోతూ వస్తున్న సమయంలో సీనియర్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంతో పార్టీ సానుభూతి పరులకు మింగుడు పడటం లేదు. మున్ముందు ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది.