రేవంత్‌రెడ్డి తనిప్పుడు ఉన్నపీసీసీ పదవిని చంద్రబాబు నాయుడు పైసలతో కొనుక్కున్నాడని, రేవంత్‌ చంద్రబాబుకు ప్రియ శిష్యుడని అన్నారు ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌. అందుకే చంద్రబాబు ఆనాడు వ్యవసాయం దండుగ అన్నట్టుగానే ఇప్పుడు అతని ఆత్మ అయిన రేవంత్‌తో మూడు గంటల కరెంటు అని అనిపిస్తున్నదని అన్నారాయన. నిజామాబాద్‌ రూరల్ మండలం గుండారం రైతువేదికలో జరిగిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. చంద్రబాబును ఆనాడు రైతులు ఇంటికి సాగనంపారని, ఇప్పుడు కాంగ్రెస్‌కు కూడా అదే గతి పడుతుందన్నారు. ఆనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వాల పాలనలో రైతులు వ్యవసాయం చేస్తే అల్లికి అల్లి సున్నకు సున్నగా మిగిలాయని, అంతా నష్టపోయారని అన్నారు.

ఈ దరిద్రాన్ని పారద్రోలి వ్యవసాయాన్ని పండుగ చేసింది కేసీఆరేనని తెలిపారు. తెలంగాణలో ఇప్పుడు అమలవుతున్న పథకాలతో దేశ వ్యాప్తంగా మనం రోల్‌మోడల్‌గా నిలిచామని, ఈసారి మళ్లీ కేసీఆర్‌ను గెలిపించుకుంటే ప్రపంచంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలుస్తుందన్నారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ద్వారానే అభివృద్ధి, సంక్షేమం దొరుకుతుందని వేరే పార్టీలకు ఇక్కడ తావులేదన్నారు. కేసీఆర్‌ వచ్చిన తర్వాత మొత్తం చెరువులను బలోపేతం చేయడం ద్వారా రైతాంగానికి కొత్త జీవం పోశారని గుర్తు చేశారు. అప్పుడు మొత్తం ఉన్న భూమిని కూడా సాగు చేసుకునే పరిస్థితి లేదని, ఇప్పుడు ఎకరం కూడా పడావు లేకుండా పంటలు సాగు చేసుకుంటున్నారని, కూలీల కొరత ఏర్పడటంతో బీహార్‌ నుంచి తెచ్చుకుంటున్నారని తెలిపారు. కల్లాల వద్దకే వచ్చి రైతు పండించిన ప్రతీ ధాన్యాన్ని ప్రభుత్వం కొంటున్నదని, దీని ద్వారా ఏటా 1700 కోట్లు నష్టపోతున్నదని అన్నారు. అయినా కేసీఆర్ రైతుల కోసం ఇదంతా చేస్తున్నారని, ఇలా ఏ సీఎం చేయలేదని అన్నారు. కాంగ్రెస్‌ నమ్మి మోసపోవద్దని, గోస పడతామని, మూడు గంటల కరెంటే దిక్కవుతుందని ఆయన రైతులకు సూచించారు.

‘మూడు పంటలు కావాల్నా.. మూడు గంటలు కావాల్నా.. మత చిచ్చు పెట్టే మంటలు కావాలా..? ఇప్పుడు మనది ఇదే నినాదం. రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎవరూ బీజేపీకి అవసరం లేదు. మోసకారులు వస్తరు తొందరలో. రెచ్చగొడతారు. ఎమ్మెల్యేల గల్లా పట్టాలంటున్నారు. ఎందుకు పట్టాలా..? నిజానికి పట్టాల్సింది కాంగ్రెస్‌ నాయకుల గల్లా. తప్పుడు నినాదాలిచ్చి , ప్రజలను మోసం చేసి ఇరవై అయిదు గంటల కరెంటు ఇస్తామని చెప్పే పిచ్చి మాటల ప్రతిపక్షానికి తగిన బుద్ది చెప్పాల్సిన అసవరం ఉంది’ అని బాజిరెడ్డి అన్నారు. ‘దళితులకు దళితబంధు, సొంత జాగా ఉంటే గృహలక్మీ పథకం ద్వారా మూడు లక్షల ఆర్థిక సాయం.. ఇలా కేసీఆర్‌ ప్రజలకు ఎన్నో మంచి పనులు చేశాడు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు… రేవంత్‌ ముక్కుపిండి రైతులకు క్షమాపణ చెప్పేదాక వదలొద్దు’ అని సూచించారు. ‘రైతాంగాన్ని మోసం చేసే వ్యక్తులు వస్తారు. తల్లిదండ్రికి అన్నం పెట్టనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు తొడిగిస్తానన్నాడట.. కాంగ్రెస్‌ నాలుగు వేల పింఛన్‌ అనే మాట అట్లనే ఉంది. ఆసరా పింఛన్‌ రాకపోతే ముసలోళ్లు చచ్చిపోతుండే. ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, వితంతవులకు ఎంతో ఆసరాగా ఉంటున్నాడు కేసీఆర్. కేసీఆర్‌ను కాపాడుకోవాలి. బీఆరెస్‌ పార్టీని గెలిపించుకోవాలి..’ అని పిలుపునిచ్చారు.

‘తెలంగాణ ప్రభుత్వం వచ్చి తొమ్మిదేండ్లు అవుతుంది. ప్రతీ ఒక్కరికీ ఏదో రకంగా ఈ ప్రభుత్వం ద్వారా లాభం జరుగుతున్నది. ప్రత్యేకంగా రైతులకు ఎంతో మేలు జరుగతున్నది. కిరణ్‌రెడ్డి, రోశయ్యను సీఎంలుగా చూశాం. కిరణ్‌రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైతే చీకట్లేనని వెలుగే ఉండదని చెప్పాడు. అంతకు ముందు సీఎం చంద్రబాబు ఉన్నప్పుడు వ్యవసాయమే దండుగ అని చెప్పిండు. ఇంటికి సాగనంపారు ప్రజలు. తర్వాత రాజశేఖర్‌రెడ్డి తొమ్మిది గంటల కరెంటు ఇచ్చిండు. రాత్రి కరెంటుతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. పాముకాట్లు, మోటర్లు కాలిపోవుడు, కరెంటు షాకులతో ఇబ్బందులు పడ్డారు. కరెంటు లేక, వ్యవసాయం చేయలేక, వర్షం లేక చాలా ఇబ్బందులు పడ్డారు. పండిన పంటలను కూడా గవర్నమెంటు కొనలేదు. అల్లీకి అల్లికి సున్నకు సున్న అప్పుడు. ఈ దరిద్రం మొత్తం రాష్ట్రంలో కేసీఆర్‌ తీసేశారు. ఇరవై నాలుగ్గంటల కరెంటు, రైతుబంధు ఇచ్చాడు. మొత్తం చెరువులు రిపేరు చేయించి వ్యవసాయాన్ని పండుగ చేశాడ’ని బాజిరెడ్డి గోవర్దన్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఐడీసీఎంఎస్‌ చైర్మన్ సంబారు మోహన్‌, జిల్లా ఒలంపిక్‌ సంఘం ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌, రైతులు, బీఆరెస్‌ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

You missed