దళిత బంధు పథకం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి తెలంగాణ ప్రభుత్వం దళితుల పట్ల చిత్తశుద్ధిని చాటుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ,రమేష్ బాబు డిమాండ్ చేశాడు. శనివారం రుద్రూర్ సీపీఎం గ్రామ పార్టీ శాఖ మహాసభలో ఆయన మాట్లాడాడు.
దళిత బంధు పథకం బాన్సువాడ నియోజకవర్గంలో అమలు జరిగేలా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి చొరవ తీసుకోవాలి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజురాబాద్ ఉప ఎన్నికల మూలంగా దళిత బంధు పథకం కేసీఆర్ ప్రభుత్వం తెచ్చింది. దళిత బంధు బాన్సువాడ నియోజకవర్గంలో అమలు చేయకపోతే శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా రాజీనామాకు సిద్ధపడాలి.
“పేరు గొప్ప ఊరు దిబ్బ” అన్నట్టుగా పేరు పెట్టి ప్రజలను మోసం చేయొద్దు. దళితులకు మూడెకరాలు ఇస్తామని, ఆ పథకాన్ని అటకెక్కించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు కూడా ఇవ్వలేదు. దళితులే కాకుండా అట్టడుగు వర్గాలకు, ప్రతీ పేద కుటుంబానికి పది లక్షలు ఇవ్వాలని మా డిమాండ్. పోచారం రాజీనామా చేస్తే వెంటనే బాన్సువాడలో దళితబంధు అమలవుతుంది. అవసరమైన ప్రతీ పేదవాడికి ఈ పథకాన్ని వర్తింపజేయాలి.