దళితబంధు అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్న బిగాల గణేశ్గుప్తా కొంపముంచింది. ఎడాపెడా ఇష్టమొచ్చినట్టు అందరికీ హామీలిచ్చేశాడు. నీకిన్ని నీకిన్ని అంటూ వాటాలు పంచేశాడు. వారంతా జనాల వద్ద కమీషన్లు నొక్కేశారు. తీరా చూస్తే ఎన్నికలొచ్చాయి. బీఆరెస్ ను తిరస్కరించారు ప్రజలు. దళితబందు లేదు.. బీసీ బంధు లేదు. ఇప్పుడొచ్చిన బాధల్లా ఏంటంటే కార్పొరేటర్ల బిగాల ఇంటి ముందు లైన్ కట్టారు. ప్రజల వద్ద ముందే కమీషన్లు తీసుకోవడంతో వారంతా ఇప్పుడు తిరిగి ఇచ్చేయమంటున్నారు.. మావద్ద లేవు. సాయం చేయండని. ఇదేం లెక్క. నాకేం సబంధం అనే రీతిలో అక్కడి నుంచి సమాధానం రావడంతో బీజేపీ ఇదే అవకాశం అని మేయర్ సీటుపై కన్నేసింది. అంతకు ముందు మేం కష్టపడి గెలుచుకున్న కార్పొరేటర్లనే కదా మీరు కొనుగోలు చేసింది.. ఇప్పుడు మేం అదే చేస్తాం అని రంగంలోకి దిగారు. అప్పుడే నలుగురిని గంజేశారు. కాషాయ కండువా కప్పేశారు.
ఆ లోపే హైదరాబాద్ నుంచి కదలికవచ్చింది. ఎమ్మెల్సీ కవిత స్పందించారు. బిగాల గణేశ్గుప్తాను అలర్ట్ చేశారు. వెంటనే ఆయన ఆగమేఘాల మీద అర్బన్ పార్టీ కార్యాలయంలో మీటింగు పెట్టి అందరినీ అరుసుకున్నారు. ఎంతో కొంత సమర్పించుకుని కంట్రోల్ ఉంచుకున్నారు. ఇప్పటికైతే ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నా.. రేపు ఏమవుతుంతో తెలియని పరిస్తితి ఏర్పడింది అర్బన్లో. అర్బన్ ఎమ్మెల్యేగా ధన్పాల్ సూర్యనారాయణ గెలవడం, ఎంపీగా అర్వింద్ ఉండటంతో ఇప్పుడు బీఆరెస్ నేతలు అయితే బీజేపీ లేదా కాంగ్రెస్ వైపు అనే రీతిలో అవకాశం కోసం చూస్తున్నారు. ఈ క్రమంలోనే అర్బన్లో దళితబంధు కమీషన్ల ఒత్తిడి తీవ్రమైంది. ఇదే మంచి అవకాశమని జంప్లు కొట్టే అలవాటున్న కార్పొరేటర్లు షరా మామూలుగా జంప్ అయ్యారు. ఇంకా కొంత మంది అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.