మొన్నటి వరకు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల స్కీమ్లపై దుమ్మెత్తిపోసిన బీఆరెస్ నాయకులు.. ఇప్పుడు ‘ అంతకు మించి’ సీఎం కేసీఆర్ పథకాల జాతరకు తెరలేపనున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. ఆదివారం కేసీఆర్ బీఆరెస్ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నాడు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల స్కీమ్లన్నీ దాదాపుగా దీంట్లో ఉండనున్నాయి. దీనిపై జనాల్లోనే కాదు.. ప్రతిపక్షాల్లో కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కేసీఆర్ వైరల్ ఫీవర్తో దాదాపు ఇరవై రోజులకు పైగా ప్రగతి భవన్కే పరిమితమయ్యారు. ఈ సమయంలో మ్యానిఫెస్టోకు కసరత్తు చేశాడు. కొంగొత్త పథకాలకు రూపు కల్పన చేశాడు.
ఎన్నికల వేళ కేసీఆర్ తీసుకునే స్టైలే వేరు. ప్రతిపక్షాలను తక్కువగా అంచనా వేయడు. వాళ్లు ప్రవేశ పెట్టిన పథకాలకు ‘ అంతకు మించి’ ప్రకటనలు చేసేందుకు వెనుకాడాడు. గత ఎన్నికల్లో కూడా నిరుద్యోగ భృతిపై విమర్శలు చేసిన కేసీఆర్.. తనూ నిరుద్యోగ భృతి అమలు చేస్తానని ప్రకటించాల్సి వచ్చింది. కానీ ఇప్పటి వరకు దాన్ని అమలు చేయలేదు. ఆదివారం ప్రకటించే మ్యానిఫెస్టో ఇదే పద్దతిలో ఉండనుంది. వాస్తవంగా ఇప్పుడు ప్రభుత్వం ప్రవేవపెట్టిన పథకాలు అమలు చేయలేక కేసీఆర్ చేతులెత్తేశాడు. దళిత బంధు, గృహలక్ష్మి తదితర పథకాలు పెండింగ్లో పెట్టేశాడు. చాలా వ్యతిరేకత మూట గట్టుకున్నాడు.