కరోనా ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించింది. లక్షలాది మందిని పొట్టనబెట్టకుంది. కోట్ల కుటుంబాలను రోడ్డు పాలు చేసింది. ఓ వైపు ప్రాణాలు పోతుంటే.. మెడికల్ మాఫియా పంజా విసిరింది. రక్తం పీల్చింది. శవాలపై కాసులేరుకున్నది. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడూ ఉంది కరోనా. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ ఉంటుంది కరోనా. ఇప్పుడు నడుస్తున్న కరోనా పేరు ఒమిక్రాన్ వేరియంట్. ముందు ముందు ఇంకా పేర్లు మార్చుకుని రూపం మార్చుకుని వస్తుంది. కరోనా తీవ్రత మాత్రం మన బాడీలో పనిచేయదు ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్లు వేసుకోవడం మూలంగా 68 శాతం యాంటీబాడీలు ప్రజల శరీరాల్లో ఏర్పడ్డాయి.
ఇప్పుడు ఏ కరోనా వచ్చినా ఎవరినీ ఏమీ చేయదు. ఇదిప్పుడు ఓ సాధారణ జలుబు లాంటిది. అంతే. దీంతో అయ్యేదేమీ లేదు. కానీ ఈ మధ్య కాలంలో ఈ కేసులు విస్తరిస్తున్నాయి. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఆస్పత్రిలో చేరడం లేదు చికిత్స కోసం. అరవై ఏండ్ల పై బడిన వారికి మాత్రం కొంచెం ఇబ్బంది. అంతే. ఎవరికీ ఏమీ కాదు. ఇంతకు ముందు స్టార్టింగులో కరోనా సోకితే 14 రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాల్సి వస్తుండే. ఆ తర్వాత అది పది రోజులకు కుదించారు. ఆ తర్వాత ఏడు రోజులు.. ఇప్పుడు ఐదు రోజులుంటే చాలు.
ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ను జయించే శక్తి ప్రపంచానికి వచ్చిందని నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల క్రిటికల్ కేర్ యూనిట్ విభాగాధిపతి కిరణ్కుమార్ మాదాల అన్నారు. రెండు వ్యాక్సిన్లు వేసుకుని 90 రోజులు గడిస్తే చాలు.. వారిని ఏ కరోనా ఏమీ చేయలేదన్నారు.