హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఎంతెంత ఆలస్యమైతే అంతగా ఈటల రాజేందర్కే రాజకీయంగా నష్టం జరిగే అవకాశం కనిపిస్తున్నది. పశ్చిమబెంగాల్ తదితర ఉప ఎన్నికల నేపథ్యాన్ని దష్టిలో పెట్టుకొని బీజేపీ ఇప్పట్లో నిర్వహించోద్దనే భావనలో ఉన్నట్లు తెలుస్తున్నది. వాస్తవంగా అమిత్ |షా తెలంగాణ రాజకీయాల పై సీరియస్గా దృష్టి పెట్టాడు. ఏకంగా సీఎంతోనే ఢీకొట్టి బీజేపీలో చేరడం ఆ పార్టీకి మైలేజ్ ఇచ్చే అంశమే. ఇక్కడ వెంటనే ఉప ఎన్నిక నిర్వహిస్తే ఈటల రాజేందర్ పై ఉన్న సానుభూతి, అదరణ ఆయనకు కలిసి వస్తుండే. కానీ ఇది మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మరోవైపు కేసీఆర్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈటల రాజేందర్ను తక్కువ అంచనా వేయడం లేదు. బీజేపీని నమ్మే ప్రసక్తి లేదు. గత అనుభవాల దృష్ట్యా మరింత అప్రమత్తమవుతున్నాడు కేసీఆర్. దీంతో ఈటలను అష్టదిగ్భంధం చేస్తున్నాడు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరికీ పార్టీ కండువా కప్పేస్తున్నాడు. దీనికి తోడు సోషల్ మీడియా దాడి కూడా ఈటల పై పెరిగింది. మానసికంగా, క్షోభకు గురి చేసే విధంగా పోస్టింగులు, కామెంట్లు పెడుతున్నారు. పాదయాత్ర పన్నెండు రోజుల పాటు 222 కి.మీ తిరిగాడు. అస్వస్థత కారణంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. నోటిఫికేషన్ మరింత ఆలస్యమవుతుందనే అంశం ఇప్పుడు బీజేపీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నది. ఇది వారికి నిరాశను కలిగిస్తున్నది. ఈటలకు నష్టం జరుగుతుందనే ఆందోళన వారిలో కనిపిస్తున్నది.
అయితే తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కోరగా.. కరోనా వల్ల ఇప్పుడు వొద్దు అని మేసేజ్ ఇచ్చింది. హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో కూడా ఇలాగే స్పందించి ఉంటుంది. మరింత ఆలస్యం చేయడం కూడా ఈటలను కోలుకోలేని దెబ్బ కొట్టడమనే ఎత్తుగడగా కేసీఆర్ ప్రయోగిస్తున్నాడు. మరోవైపు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ హుజురాబాద్ ఉప ఎన్నిక తొందరగా నిర్వహించాలని కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు తెలుస్తున్నది. మరింత ఆలస్యమయ్యే పరిస్థితులే ఉన్నట్లు స్పష్టమైతే ఈటల పాదయాత్ర కూడా ఆలస్యమవుతుంది.