బీజేపీకి ఇప్పుడు టార్గెట్ టీఆరెఎస్ కాదు. అది నిన్నటి వరకు. బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ను టార్గెట్ చేస్తున్నది. మొన్నటిదాకా ప్రత్యామ్నాయంగా టీఆరెఎస్కు తామే అని దూసుకుపోయిన బీజేపీకి కొత్తగా జీవం పోసుకొని జనాల చెంతకు వస్తున్న కాంగ్రెస్ బ్రేకులు వేస్తున్నది. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అనే పోటీ నెలకొన్నది. ప్రధాన ప్రతిపక్షంగా తామే ఉండాలని కోరుకుంటున్నాయి. సహజంగానే టీఆరెఎస్ పై క్రమంగా ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతూ వస్తున్నది. ప్రత్యామ్నాయం కోసం ప్రజలు చూస్తున్నారు. కేసీఆర్ ప్రతిపక్షాలను ఎదుగనీయలేదు. కానీ అనూహ్యంగా బీజేపీ పుంజుకొచ్చింది. మేమే ప్రధాన ప్రతిపక్షంలా ఉంటాం అని కాలర్ ఎగరేసే సమయానికి కాంగ్రెస్ పుంజుకుంటున్నది.
అధికార పార్టీ వ్యతిరేక పవనాలు ప్రధాన ప్రతిపక్షానికి అనుకూల పవనాలుగా మారుతాయి. అది జనరల్ ఎలక్షన్లో అయాచితంగానే నెంబర్ టూలో ఉన్న పార్టీకి కలిసి వస్తుంది. అందుకే ఈ రెండు పార్టీలు నెంబర్ టూ కోసం కొట్లాడుతున్నాయి. దీనికి తాజా ఉదాహరణ ఇటీవల నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డాడు. టీపీసీసీని చంద్రబాబు నడిపిస్తున్నాడా? కేసీఆర్ నడిపిస్తున్నాడా? అని ఆ పార్టీ విశ్వసనీయత మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేశాడు. దీని పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఘాటుగానే సమాధానమిచ్చాడు. మొన్నటి వరకు అధికార పార్టీ పై విరుచుకుపడే బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ను టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నది. కాంగ్రెస్ సైతం అటు అధికార పార్టీ పై విరుచుకు పడుతూనే బీజేపీ దూకుడుకి కళ్లెం వేస్తూ రెండో ప్లేస్లో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నది.