కూరిమిగల దినములలో నేరములెన్నడూ కలగనేరవు.. మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి…! దాదాపు ఎనిమిదేండ్లు బీజేపీ లోపాలు తెలియలేవు. తెలిసినా కిమ్మనలేదు. చప్పడు చేయలేదు. ప్రశ్నించలేదు. ఉద్యమ నేత గొంతు ఇన్నేండ్లు మూగబోయింది. ఇప్పుడు లేచింది. ప్రశ్నించే ఆ స్వరం మొన్నటి వరకు పూడుకుపోయింది… ఇప్పుడు గాండ్రిస్తున్నది. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు.. ఇలా అడ్డమైన నిర్ణయాలన్నీ అప్పుడు బాగా అనిపించాయి. భేష్ అని అనిపించేలా చేశాయి. అన్నింటికీ ఒకే కారణం.. తెలంగాణ కోసం. తెలంగాణ అభివృద్ది కోసం.
మొత్తానికి ఇన్నేండ్లకైనా ఆయన కరెక్టు పంథానే ఎంచుకున్నాడు. ప్రశ్నిస్తున్నాడు. కడిగేస్తున్నాడు. బీజేపీ హఠావో అంటున్నాడు. మంచిదే. దానితో ఇప్పటి వరకు ఒరిగిందేమీ లేదు. నష్టాలు తప్ప. పేదల ప్రాణాలు పోవుడు తప్ప. మరింత పేదరికంలోకి నెట్టివేయడం తప్ప. కానీ కేసీఆర్ ఒక్క వేలు మోడీ వైపు చూసితే మిగిలిన నాలుగు వేళ్లు కేసీఆర్ వైపే చూపుతున్నాయి. మోడీ పొలిటికల్ స్ట్రాటజీలో ఘోరంగా ఫెయిలయ్యాడని కేసీఆర్ అన్నాడు. కేసీఆరు కూడా చాలా సార్లే ఫెయిల్ అయ్యాడు. ఎప్పుడో మిషన్ భగీరథ ప్రారంభమప్పుడు మోడీ మాట్లాడిన స్పీచ్ను ఇప్పుడు సెల్ఫోన్లో చూపెట్టి కేసీఆర్ మాట్లాడుతుంటే చెప్పొద్దు.. చాలా ఎబ్బెట్టుగా అనిపించిందంటే నమ్మండి. ఎవరో సాదాసీదా పనిలేని ఎమ్మెల్యే ఓటీవీ చర్చా వేదికలో మాట్లాడినట్టే అనిపించింది. అప్పుడు ఏమన్లే పోనీ అని ఊకున్నాం.. అన్న ఆ కేసీఆర్ మాటలే ఆయనలోని బలహీనతను, అసమర్థతను తెలియజేశాయి. అంతా తెలంగాణ కోసమే అంటారా..? సరే, అలాగే అనుకుందాం. పోనీయ్యండి.
మొత్తానికి బీజేపీపై కేసీఆర్ తగ్గేదే లే అంటున్నాడు. జరగాల్సిన ప్రమాదమంతా జరిగిన తర్వాత ఇప్పుడు మేల్కొన్నాడు. కానీ, ఇది కేసీఆర్ సమస్య కాదు. తెలంగాణ సమస్య. బీజేపీతో కేసీఆర్ పెట్టుకోవడమంటే అది తన వ్యక్తిగతం కాదు. అది కచ్చితంగా రాష్ట్ర సమస్యే. వచ్చే ఎన్నికల నాటికి ఇంకా రాజకీయ పరిణామాలు చాలానే చోటు చేసుకుంటాయి. తెలంగాణ అవన్నీ చూడాల్సి ఉంది.
బీజేపీ గాలి తీసేశాడు కేసీఆర్. బండి సంజయ్ ఏదైనా నీళ్లులేని బావిలో పడి చచ్చిపోవాలి…అంతలా తూలనాడాడు కేసీఆర్. రాహుల్పై అస్సాం సీఎం వ్యాఖ్యల ఖండన నుంచి రాఫెల్ విమానాల కొనుగోల అవినీతి వరకు దేన్నీ వదల్లేదు. అన్నింటినీ వెలికి తీశాడు. చాలా సుధీర్ఘంగా దాదాపు రెండు గంటల పాటు అన్ని విషయాలు మాట్లాడాడు. చాలా సబ్జెక్టు చర్చకు వచ్చింది. కేసీఆర్ ప్లేస్లో ఇంకొకర్ని ఊహించుకోలేం. తెలంగాణపై పట్టు ఉంది. రాజకీయాలపై అవగాహన ఉంది. మొత్తానికి ఓ గట్టి నిర్ణయానకొచ్చాడు. జంగ్ సైరన్ ఊదాడు. బీజేపీని గద్దె దించితే తర్వతా ఎవరితోనే ఒకరితో కలుస్తామని పరోక్షంగా కాంగ్రెస్కు సపోర్టు చేస్తున్నట్టే ఒప్పుకున్నాడు. థర్డ్ ఫ్రంట్ ముచ్చట తీయలేదు. ప్రజా ఫ్రంటే అన్నాడు. ఒక్కటే ఎజెండా మోడీని గద్దె దించాలి. బీజేపీని ఓడగొట్టాలి.
కొత్త పార్టీకీ సై అన్నాడు కానీ అది జరిగే ముచ్చట కాదు. రాజ్యాంగం మార్చాలనే తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం బాగుంది కానీ, అది పూర్తిగా సమంజసనీయమనించలేదు. ఆ తర్వాత అది ఓ పెద్ద సబ్జెక్టని బ్యాక్ గ్రౌండ్ పెద్దదని సమాధానాన్ని దాటవేశాడు.
మోడీ పాత తప్పులన్నీ తవ్వేందుకే ఎక్కువ ప్రయార్టీ ఇచ్చాడు కేసీఆర్. దేశాన్ని రక్షించుకుందామన్నాడు. రాష్ట్ర మంతా బాగుపడి ఇక్కడి ప్రజలంతా ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతున్నట్టే ఉన్నాయా మాటలు.
ఓటమి అంటే సహించరు. అహంకారం వలదు. అంతా తామే అన్నట్టు ఉంటారు… ఇంకా చాలా విషయాల్లో బీజేపీ, మోడీని విమర్శించినా అవి కేసీఆర్కు కూడా అతికట్టే సరిపోతాయనిపించింది కొన్ని విషయాల్లో.