దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రధాన ప్రతినిధి:
ఓడినా వేముల ప్రశాంత్రెడ్డిని వదలడం లేదు ముత్యాల సునీల్రెడ్డి. నిను వీడని నీడను నేనే అంటూ వెంటాడుతున్నాడు. వేటాడుతున్నాడు. బాల్కొండలో సునీల్రెడ్డి ఓ షాడో ఎమ్మెల్యే. అంతా తానై నడిపిస్తున్నాడు. ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అక్కడ డమ్మీ. ఇదంతా అందరికీ తెలిసిందే. అందరికీ తెలియని విషయం ఇంకొకటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అంతా జంప్ అవుతున్నారు. అది కామనే. కానీ బాల్కొండలో మాత్రం అలా జంప్ అయి పార్టీ కండువా కప్పుకుని పదవులు తీసుకుంటానంటే కుదరదు. ఎందుకంటే అక్కడ సునీల్రెడ్డి ఉన్నాడు.
తృటితో తప్పిన తన ఓటమికి బాధ్యులు ప్రశాంత్రెడ్డికి దగ్గరగా ఉన్న అందరూ. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కుంట రమేశ్రెడ్డి. ఇప్పుడాయన డీసీసీబీ చైర్మన్. ఆయన రాకకు కారణం.. రమేశ్రెడ్డి ఆర్థిక మూలాల మీద సునీల్రెడ్డి బలమైన దెబ్బ కొట్టాడు. దాదాపు వంద కోట్ల బిల్లులను ఆపేయించాడు. విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాడు. దీంతో నిద్రలేని రాత్రులు రమేశ్రెడ్డికి మిగిలాయి. దీనికి తోడు సుదర్శన్రెడ్డికి తమ్ముడి వరుస రమేశ్రెడ్డి. ఇక పార్టీ మారడం తప్ప గత్యంతరం లేదు. కానీ సునీల్ అడ్డుకున్నాడు. కానీ సుదర్శన్రెడ్డి వినలేదు. దీంతో డీసీసీబీ చైర్మన్గా కుంట రమేశ్రెడ్డి ఎన్నికయ్యాడు.
బాల్కొండకు కాంగ్రెస్ నుంచి తానే కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థి అని కూడా ప్రచారం జరుగుతోంది. ఇదంతా జరిగిన ముచ్చట. తాజా ముచ్చట ఏందంటే.. మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నాయకుడు, దళిత లీడర్ రాజేశ్వర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది. కానీ చేరలేదు. ఎందుకు..? సునీల్రెడ్డి అడ్డుకున్నాడు. తన ఓటమిలో రాజేశ్వర్రావూ ఓ ప్రధాన కారణమే అని రేవంత్కు చెప్పాడు. పార్టీలో జాయినింగ్ ఆగిపోయింది. రాజేశ్వర్ రావే కాదు ప్రశాంత్రెడ్డికి ఎన్నికల్లో పనిచేసిన ఏ లీడర్ను సునీల్రెడ్డి దరికి రానీయడం లేదు. పార్టీలో చేర్చుకోవద్దుంటున్నాడు. చేస్తే ఊరుకోనంటున్నాడు.
కోటపాటి నర్సింహానాయుడు, డాక్టర్ మధుశేఖర్ పరిస్థితి కూడా ఇదే. ఇంతే సంగతులు. లక్కీగా మార గంగారెడ్డి బయటపడ్డాడు. ఆయనా ప్రశాంత్రెడ్డికే పనిచేశాడు. కానీ ఆర్మూర్ నియోజకవర్గం కావడంతో వదిలేశాడు సునీల్. అప్పటికీ మార పార్టీ మారేందుకు నానా తంటాలు పడ్డాడు. నిన్న ఆయన అధికారికంగా పార్టీలో చేరాడు.