బీజేపీకి పరాభవం, కాంగ్రెస్‌లో ప్రియాంకం

ఎన్నికల ముందు అంచనాలకు అనుగుణంగానే కర్ణాటక ఎన్నికలలో బీజేపీ పరాభవం పాలైంది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో బీజేపీకి పాటు పుష్కలంగా నిధులు ఉన్నాయి. కులాల వారిగా చీల్చడం, విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి అధర్మ యుద్ధం ఈ పార్టీకి అలవాటే. అయినా ప్రజాతీర్పు బలంగా వ్యక్తమైనప్పుడు ఇవేవీ పనిచేయవు. ఎమర్జెన్సీ తరువాత జరిగిన 1977 ఎన్నికలు ఇందుకు ఉదాహరణ.

కాంగ్రెస్‌కు ఏమాత్రం మెజారిటీ తగ్గినా, అత్తెసరు మెజారిటీ వచ్చినా బీజేపీ ఏవో కుయుక్తులు పన్నేదే. కానీ కాంగ్రెస్ ఆరవై శాతానికి పైగా స్థానాలు సాధించుకున్నది. ఒక్కలిగలు బలంగా ఉన్న పాత మైసూర్ ప్రాంతంలో జనతాదళ్ ఎస్‌కు సీట్లు భారీగా తగ్గిపోయి, కాంగ్రెస్ బలం పెరిగింది. లింగాయతుల మద్దతుతో బీజేపీ ప్రాబల్యం చాటుకున్న కిత్తూరు కర్ణాటక, మధ్య కర్ణాటక ప్రాంతాలు కూడా కాంగ్రెస్‌కు నీరాజనం పట్టాయి.

లౌకిక స్వభావం గల దక్షిణాది రాష్ట్రాలలో హిందీ పార్టీ, మతతత్వ పార్టీ అయిన బీజేపీ పట్టు సాధించడం సాధ్యం కాదని దీనిని బట్టి స్పష్టమవుతున్నది. కర్ణాటక ఎన్ని ల ప్రభావం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులకు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ప్రేరణ నిస్తుంది. అయితే కొందరు ప్రచారం చేస్తున్నట్టు ఈ గెలుపు రాహుల్‌గాంధీ జోడో యాత్ర వల్ల సాధ్యమైందని అనుకుంటే మాత్రం పొరపాటే. ఈ గెలుపులో స్థానిక నాయకుల కృషి ప్రధానమైంది. కాంగ్రెస్ నాయకత్వం భిన్న గ్రూపులను సముదాయించడంలో, టికెట్లు ఇవ్వడంలో, పార్టీ యంత్రాంగాన్ని ఉత్సాహభరితంగా నడిపించడంలో సఫలమైంది. ఈ ఘనత సోనియా, ప్రియాంకతోపాటు ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుకు కూడా దక్కుతుంది.

కర్ణాటక ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక మరో మెట్టు పైకి ఎగబాక గలిగారు. కాంగ్రెస్ నాయకత్వం విషయంలో సోనియా మొదట్లో రాహుల్ గాంధీ వైపే మొగ్గు చూపారు. కానీ ఆయన నిరాసక్తతను, కొంత మేర అసమర్థతను చాటుకున్నారు. ఆయన నిర్ణయాలు రాజకీయాల గురించి సాధారణ పరిజ్ఞానం ఉన్న వారిని కూడా ఆశ్చర్యపరిచాయి. కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని ప్రథమ శత్రువుగా పరిగణించాలె. తన కున్న కొద్దిపాటి శక్తియుక్తులన్నీ బీజేపీని ఢీకొట్టడానికి ఉపయోగించుకోవాలె. బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకపోవాలె. కానీ రాహుల్ గాంధీ సరళి ఇందుకు భిన్నంగా సాగింది. మధ్య ప్రదేశ్, రాజస్థాన్‌లలో బీజేపీ వ్యతిరేకత కొద్దీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టారు. అక్కడ పార్టీని మరింత స్థిరపరచుకోవాలె. యూపీ బీహార్ వంటి చోట్ల బీజేపీ యేతర పక్షాలు పోరాడుతుంటే వారికి వదలి పెట్టాలె. ప్రజల ముందు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నిలిచి దేశాన్ని పాలించగలవనే నమ్మకం కలిగించాలె.

కానీ ప్రియాంకను ఒకటి రెండు శాతం ఓట్లున్న యూపీకి పరిమితం చేశారు. గెలువ లేని ప్రాంతాన్ని ఆమెకు అప్పగించి విఫల నేతగా నిలిపే ప్రయత్నం చేశారు. మిత్రపక్షాలతో కయ్యానికి దిగారు. దీంతో అటూ యూపీ బిహార్‌లలో, ఇటు మధ్య ప్రదేశ్ రాజస్థాన్‌లలో దాదాపు సీట్లన్నీ మోదీకి బంగారు పళ్ళెంలో పెట్టి సమర్పించుకున్నారు. ప్రతిపక్ష శిబిరంలో సోనియా పట్ల ఉన్న గౌరవాభిమానాలు రాహుల్‌కు లేవు. రాహుల్ చేతకానితనాన్ని పార్టీ శ్రేణులు ఆమోదించలేక పోయాయి. మరోవైపు బీజేపీ ఆయనను పప్పు అంటూ ముద్ర వేసింది.

పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత, ఆ పదవి గాంధీ కుటుంబంలోని ఎవరికీ కట్టబెట్ట వద్దని రాహుల్ షరతు పెట్టారు. ఇది ప్రియాంకను కట్టడి చేయడమే. పార్టీ చర్చలలోనూ ఆమెను కించపరిచారు. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ వైదొలగాలని, ప్రియాంకకు పగ్గాలు ఇవ్వాలని కార్యకర్తల ఒత్తిడి మొదలైంది. ఇది చాలా సార్లు బహిరంగంగానే సాగింది. అనారోగ్యంతో ఉన్నా సరే సోనియా పార్టీ బాధ్యతలు చేపట్టవలసి వచ్చింది. ఇది బాధాకరమే కానీ గత్యంతరం లేకపోయింది.

ఉదయ్‌పూర్ సంకల్ప ప్రకటన తరువాత – 2022 మే చివరలో సోనియా గాంధీ పార్టీలో ఉన్నత స్థాయి కమిటీలు వేశారు. ఇందులో సభ్యులు, విధుల సంగతులెట్లా ఉన్నా, పార్టీ సంస్థాగత బాధ్యతలను రాహుల్‌కే అప్పగించారు. కానీ ఎన్నికల టాస్క్ ఫోర్స్ బాధ్యత ప్రియాంక చేతిలో పెట్టారు. ఈ టాస్క్ ఫోర్స్ 2024 సార్వత్రక ఎన్నికల వరకు ఉంటుంది. అంటే రాహుల్ గాంధీ అడ్డు లేకుండా, పార్టీని గెలిపించే బాధ్యతలు ప్రియాంక చేతిలో పెట్టారు. ఎన్నికల నిపుణుడు సునీల్ కనుగోలు ఆమెకు జోడీగా మారారు. రాజకీయ వివాదాలకు దిగకుండా ఎటువంటి ప్రకటనలు చేయకుండా, తెరవెనుక ఉండి సలహాలు ఇవ్వడం, వ్యవహారం నడిపించడం సునీల్ కనుగోలు స్వభావం అంటారు.

కాంగ్రెస్‌కు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో క్షేత్ర స్తాయిలో కార్యకర్తల బలం ఉండటం అనుకూలాంశం. పార్టీ అధినాయకత్వంతో నిమిత్తం లేకుండానే, వారు పోరాడగలరు. పార్టీ నాయకత్వం చేయవలసింది వారికి సహకరించడమే. వారి సూచనలు వినకుండా, రాహుల్ గాంధీ నిర్లక్ష్యం చేసి అవమానించడం వల్లనే అస్సాం చేజారిపోయింది. అక్కడ బీజేపీని నెత్తికి ఎత్తుకున్నది అసంతృప్తికి గురైన కాంగ్రెస్ పరివారమే. ఛత్తీస్ గఢ్‌లో సోనియా అండతో స్థానిక నాయకులే బీజేపీని దెబ్బతీశారు. హిమాచల్ ప్రదేశ్‌లో స్థానిక నాయకులే బీజేపీకి ఎదురొడ్డి పోరాడారు. ఈ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవడంతో ప్రియాంక చేసిన కృషి కూడా తక్కువేమీ కాదు. ఎన్నికల టాస్క్ ఫోర్స్‌లో భాగంగా ఆమె తన సత్తా చాటుకున్నారు.

ఇప్పుడు కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్‌ను పోరాట శక్తిగా నిలపడంలోనూ ప్రియాంక – కనుగోలు చాకచక్యం ఉన్నది. నాయకుల విభేదాలు పార్టీని దెబ్బతీసే స్థాయికి చేరకుండా నడిపించారు. అటు ఒక్కలిగల కంచుకోట అయిన పాత మైసూరు ప్రాంతంపై దృష్టిపెట్టి, ఇటు ఉత్తర, మధ్య ప్రాంతాలో, కోస్తాలో బీజేపీ పట్ల వ్యతిరేకతతో ఉన్న లింగాయతులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించడంలో పార్టీ నాయకత్వం అలుపెరుగని కృషి చేసింది. కర్ణాటక వంటి పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రాభవం కాపాడటంలో చేసిన ప్రయత్నం ప్రియాంకను మరో మెట్టు పైకి ఎక్కించింది. ప్రియాంకకు మొదట్లో ఉన్నంత కాకపోయనా ఇప్పటికీ జనాకర్షణ ఉన్నది. కానీ ఆమె జనాకర్షణ ద్వారా కాకుండా కృషి ద్వారా పార్టీని విజయం వైపు నడిపించారు.

ప్రియాంక తెలంగాణపై కూడా దృష్టి సారించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ ఓడించగలదా అనేది ఈ దశలో చాలా పెద్ద ఆలోచన. ప్రస్తుతానికి బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ కాదు, మేమే అని ప్రజలకు చెప్పుకోగలగడం కాంగ్రెస్ సాధించవలిసింది.

కర్ణాటక ఎన్నికల గెలుపు మూలంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులలో, కార్యకర్తలలో ఆత్మ విశ్వాసం కలుగుతుంది. కూడా బీజేపీని మేం ఎదుర్కోగలమనే సందేశాన్ని ప్రాంతీయ పక్షాలకు ఇవ్వగలిగింది. ప్రతిపక్ష శిబిరంలో కాంగ్రెస్ బేరసారాలకు దిగే స్థితికి చేరుకుంటుంది.

లింగాయతులను కర్ణాటకలో అధికారం చేపట్టడానికి వాడుకొని ఆ తరువాత వారిని బీజేపీ అధిష్ఠానం తొక్కివేస్తున్న తీరు ఇతర రాష్ట్రాలలోని రాజకీయ వర్గాలు గమనిస్తున్నాయి. దక్షిణాదిన ఏ సామాజిక వర్గం ఇక ముందు బీజేపీని నమ్మే పరిస్థితి లేదు. దక్షిణాది రాజకీయాలు బీజేపీకి పొసగవు. ఇక్కడి విలువలు, సంస్కృతి భిన్నమైనవి. ఇప్పటికే హిందీని రుద్దడానికి, మిత్ర వ్యాపారవర్గాన్ని పోషిస్తూ, ప్రాంతీయ శక్తులను అణచివేయడానికి బీజేపీ చేస్తున్న కుటిల యత్నాలు దక్షిణాది ప్రజలకు అర్థమయ్యాయి. విద్వేష రాజకీయాలు, అధికార బలం, ధనబలంతో కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా, కర్ణాటకలో కాంగ్రెస్ మాదిరిగా బీజేపీ పునాదిని నిర్మించుకోలేక పోతున్నది.

తెలంగాణలోనైతే ఆ మాత్రం కాలుమోపే పరిస్థితి కూడా బీజేపీకి లేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలోని బీజేపీ శ్రేణులను నీరు గార్చడం ఖాయం.

 

నివాస్‌…

 

You missed