హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో నేతలు చెలరేగిపోతున్నారు. నిందారోపణాల పర్వాలతో హుజురాబాద్ అట్టుడుకి పోతున్నది. తాజాగా ఈటల రాజేందర్ ..గెల్లు శ్రీనివాస్ పై మంత్రి హరీశ్రావు పై చేసిన మాటల దాడి చర్చనీయాంశమైంది. ‘కేసీఆర్ బానిసను టీఆరెఎస్ తరపున హుజురాబాద్ బరిలో నిలిపార’ని ఆయన ఘాటు విమర్శలు చేశాడు. దీనిపై రాజకీయంగా కలకలం రేగింది.
మొన్నటి వరకు క్యాబినెట్లో ఉండి ఈటల రాజేందర్ సైతం అక్కడి పాలసీ నచ్చకపోయినా, సీఎం అవలభింస్తున్న విధానాలు సంహించకపోయిన చాలా రోజులు ఓపిక పట్టాడు. ఆత్మగౌరవమని మాట్లాడుతున్న ఈటల 2016 నుంచే సీఎం నుంచి తనకు అవమానాలు ఎదురయ్యాయని తాజాగా మీడియా ముందు చెప్పడం ఆయన అవకాశవాద రాజకీయాన్ని పట్టిస్తున్నది. మంత్రి పదవి కోసం, తన వ్యాపారాల కోసం అవమానాలను ఎదుర్కొంటు కూడా ఆయన ఇన్ని రోజులు పార్టీలో కొనసాగిన విషయాన్ని పరోక్షంగా ఆయన ఒప్పుకుంటు వస్తున్నాడు.
గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా ఉద్యమ కారుడే. ఒక తోటి ఉద్యమకారుడిని బానిసగా అభివర్ణించిన ఆయన మొన్నటి వరకు ఆ పార్టీలో తాను కూడా బానిస బతుకే బతికానన్న విషయాన్ని విస్మరించాడు. మరోవైపు ఈ రోజు హరీశ్ను కౌంటర్ చేసేందుకు ఆయన మాట్లాడిన మాటలు దుమారం రేపాయి. ‘నా మొత్తం వ్యవహరం నీకు తెలుసు.. నీ మొత్తం వ్యవహరం నాకు తెలుసు..!’ అని ఆయన పరోక్షంగా హరీశ్రావు బెదిరించే ప్రయత్నం చేశాడు. కంట్రోల్లో లేకపోతే ‘నీ బండారం బయట పెడత’ అనే రీతిలో నర్మగర్బంగా బెదిరింపు దోరణిలో ఆయన స్పీచ్ కొనసాగింది.
అధికారం వచ్చిన రెండేండ్ల నుంచి కేసీఆర్ ప్రజాప్రతినిధులందరినీ బానిసలుగా చేశారని ఘాటుగా విమర్శలు చేశాడు. మరి ఇన్ని రోజులు ఈటల సైతం బానిసగానే పడి ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మంత్రి పదవా..? వ్యాపారాలా? ఒకరినొకరు విమర్శించుకుని మాటల దాడులు చేసుకుంటున్న నేతలు తమకు తెలియకుండానే వారే ‘సెల్ఫ్ గోల్’ అవుతున్నారు. జనాలు వారిని చూసి నవ్వుకుంటున్నారు.