అర్వింద్ అసమ్మతి టీం…
ఒంటెత్తు పోకడలపై పార్టీలో ఉంటేనే ఎంపీపై ఫైట్..
అధిష్టానంతో టచ్లో ఉంటూ… అర్వింద్ ఆగడాలపై ఫిర్యాదులు…
బస్వా గృహ ప్రవేశం వేదికగా అసమ్మతి రాగం వినిపించిన నేతలు…
బండి హాజరు… బీఆరెస్ పార్టీ నేతలూ హాజరు…. అర్వింద్ లేకుండానే కీలక బీజేపీ నేత ఇంట వేడుక…
చర్చనీయాంశమవుతున్న బీజేపీ నేతల అసమ్మతి రాగం…
నిజామాబాద్ ప్రతినిధి- వాస్తవం:
అర్వింద్ అసమ్మతి టీం మెంబర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అంతా తాను అనుకున్నట్టే జరగాలి… నాదే నడవాలి. నేను చెప్పిందే వినాలి. నా వాళ్లకే టికెట్లు రావాలి. అంటూ తనదైన పాలనను పార్టీలో కొనసాగిస్తున్న అర్వింద్పై అసమ్మతి నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రచ్చన్నయుద్దం మొదలు పెట్టారు. ఈ కోల్డ్ వార్ .. ఎప్పుడు బయటపడి ఎలా బరస్ట్ అవుతుంతో తెలియదు కానీ.. తాజాగా బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ బస్వా లక్ష్మీ నర్సయ్య గృహ ప్రవేశం వేదికగా అర్వింద్ అసమ్మతి నేతల గళం బలంగా వినిపించారు. చాలా రోజులుగా బస్వాకు అర్వింద్కు పడటం లేదు. బీఆరెస్ నుంచి బీజేపీలో చేరిన తర్వాత తనకు అర్బన్ నుంచి టికెట్ ఇస్తారని మాటిచ్చారు. కానీ ఆ తర్వాత అర్వింద్ ధన్పాల్ సూర్యనారాయణకు మద్దతు తెలిపాడు. దీంతో అప్పటి నుంచి బస్వా పార్టీలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నాడు.
బుధవారం ఆయన గృహ ప్రవేశానికి ఎమ్మెల్సీ కవితతో పాటు బీఆరెస్ లీడర్లందరినీ ఆహ్వానించడం చర్చకు దారి తీసింది. బస్వా బీఆరెస్ గూటికి చేరుతాడా.. ? అని కూడా ప్రచారం చేశారు. కానీ అక్కడ ఉన్నవాళ్లకే సరిగ్గా పదవులు లేక ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు బస్వాకు అక్కడ ప్లేస్ ఖాళీ లేదు. మాటిచ్చేందుకు కూడా అవకాశం లేదు. ఆ విషయం బస్వాకు తెలుసు. అందుకే తన బలం పార్టీలో ఎంతుందో నిరూపించుకోవాలనుకున్నాడు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ను వేడుకకు రప్పించుకున్నాడు. అర్వింద్ ఇంటి పార్టీ బీజేపీ కాదని, అధ్యక్షుడే మాకు అండగా ఉన్నాడని చెప్పడం బస్వా ఉద్దేశం. అందునా… బండి సంజయ్కు, అర్వింద్కు పొసగడం లేదు. తన అనుచరుల కోసం చాలా మందిని బలిపెడుతున్నాడనే అభిప్రాయం బండికి ఉంది. పార్టీకి జీవం పోయాల్సింది పోయి..తన వ్యక్తిగత స్వార్థం కోసం బలిపెడుతున్నాడనే అభిప్రాయానికి వచ్చాడు.
బండి సంజయ్తో పాటు బస్వా గృహప్రవేశానికి బీఆరెస్ టీం మొత్తం హాజరైంది. బీజేపీ నాయకులకు, కార్యకర్తలుకు అసలేం జరుగుతుందో తెలియక ముక్కున వేలేసుకున్నారు. అసలు విషయం ఏమిటంటే… అర్వింద్ ఆగడాలకు, ఒంటెత్తు పోకడలకు చెక్ పెట్టడానికి ఇదంతా చేశారు. ఇప్పటికే ఆర్మూర్ నుంచి తనకు టికెట్ దక్కకుండా చేసిన అర్వింద్పై వినయ్రెడ్డి కినుక వహించాడు. కస్సుబుస్సుమంటున్నాడు. బాల్కొండలో తనకు సర్వేలో మంచి మార్కులు వస్తే మల్లిఖార్జున్కు ఎలా కమిట్మెంట్ ఇస్తాడు..? అని ముత్యాల సునీన్రెడ్డి ఫైట్ చేస్తున్నాడు. అధిష్టానానికి ఫిర్యాదు చేశాడు. అర్బన్లో భాయ్సాబ్ యెండల లక్ష్మీనారాయణ టీం మొత్తం అర్వింద్కు వ్యతిరేకం. ఎక్కడ దొరుకుతాడా..? ఎక్కడ ఒత్తెద్దామా..? అనే కసిమీద వారున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో తాజాగా బస్వా చేరారు. ఏకంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడే అర్వింద్పై అసమ్మతి జెండా ఎత్తాడంటే ఆ కషాయ జెండా పరిస్థితి మున్ముందు ఇందూరు ఎలా ఉండబోతుందో చూడాలి.