దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

గతంలో ఎక్కడ లోపాలు జరిగాయో.. వాటిని పక్కా తెలుసుకుని ముందుకు పోతోంది కాంగ్రెస్‌. గతంలో ఓడిన నేతలు చేసిన తప్పులేమిటో తాము చేయకుండా జాగ్రత్త పడుతోంది కాంగ్రెస్‌..! గత అనుభవాల నుంచి కాంగ్రెస్‌ పాఠాలు నేర్చుకుంటోంది. బీఆరెస్‌, బీజేపీ ఆ దిశగా అడుగులు వేయడం లేదు. బీజేపీకి తలబిరుసు అహంకారం తోడు రాగా.. బీఆరెస్‌కు తాము గెలిచేదా…? చచ్చేదా అనే వైరాగ్యం అలుముకున్నది. కాంగ్రెస్‌ మాత్రం దూకుడు మీద ముందుకు సాగుతోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు లక్షల ఓట్లు నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో గల్ప్‌ ఓటర్లున్నారు. ఆశ్చర్యపడకండి. లెక్కలవే చెబుతున్నాయి.

గల్ప్‌ దేశాల్లో దాదాపు లక్ష మంది ఇప్పుడు పనిచేస్తున్నారు. అంటే ఆ కుటుంబాల్లో ముగ్గురు ఓట్లను పరిగణలోకి తీసుకుంటే మూడు లక్షలకు ఏమాత్రం తక్కువ కాకుండా నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్నాయి. గతంలో కవిత వీరిని నిర్లక్ష్యం చేసింది. అందుకే ఓటమి పాలయ్యింది. ఇదే కాంగ్రెస్‌ గ్రహించింది. ఇప్పుడు చడీచప్పుడు లేకుండా గల్ప్‌ దేశాలపై గురి పెట్టింది. ఇక్కడి ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకునేందుకు రెడీ అయ్యింది. ఆపార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఇప్పుడు గల్ప్‌ దేశాలు పర్యటిస్తున్నాడు.

అక్కడి వారితో ములాఖత్‌ అవుతున్నాడు. సంఘాలుగా కలుస్తున్నాడు. కూలీల వెతలు తెలుసుకుంటున్నాడు. అక్కడినుంచే నిజామాబాద్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డితో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడిస్తున్నాడు. ఇవన్నీ చాపకింద నీరులా చేసేసుకుంటూ కాంగ్రెస్‌ తన పనితాను చేసుకుంటూ పోతున్నది. మరోవైపు ఇక్కడ సీఎం రేవంత్‌రెడ్డి రేపు అంటే మంగళవారం గల్ప్‌ బాధిత సంఘాలతో సమావేశం కానున్నాడు. వారికి ఇప్పటికే ప్రభుత్వం తాయిలాలు ప్రకటించింది. గల్ప్‌ కుటుంబాలకు సంక్షేమ సంఘం ఏర్పాటు చేయిస్తానని ప్రకటించింది. దీనికి వెయ్యి కోట్ల నిధిని కూడా ఏర్పాటు చేయిస్తున్నది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed