ఈ వార్త నిజమో ..? లేదా ఊహాజనితమో..? నమస్తే తెలంగాణ అత్యుత్సాహమో..?? తెలియదు. కానీ ఈ వార్త మాత్రం టీఆరెస్కు ఉపయోగపడేది మాత్రం కాదు. ఎందుకూ…? ఈ ఉప ఎన్నిక ను టీఆరెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. గెలుపు అనివార్యం. అదే స్థాయిలో బీజేపీ కూడా దీన్ని సెమీ ఫైనల్ అని భావించింది. కాంగ్రెస్కూ జీవన్మరణ సమస్యలా మారింది. దీంతో అందరి దృష్టీ దీనిపైనే పడింది. ఇప్పటికే టీఆరెస్ ఓ ఒక్క చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. చిన్నపామును పెద్ద కర్రతో కొట్టాలన్నారు. కానీ ఈ ఉప ఎన్నికను టీఆరెస్ మొదటి నుంచి చిన్నపాముగా చూడటం లేదు. బీఆరెస్ రూపాంతరం చెందిన తరుణంలో ఈ గెలుపు పార్టీ భవిష్యత్తుకు మరింత కీలకం కానుంది.
అందుకే టీఆరెస్ శ్రేణులంతా క్షేత్రస్థాయిలో శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నారు. ఇక్కడ సాగునీరు, తాగునీరు అంశాలు ప్రజలను బాగా ప్రభావితం చేస్తున్నాయి. టీఆరెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే సాగు, తాగునీరు విషయంలో గణనీయమైన మార్పులొచ్చాయని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. కమ్యూనిస్టుల సపోర్టు ఉండనే ఉంది. రాజగోపాల్ను యూత్ తప్ప ప్రజలంతా నమ్మడం లేదు. కాంగ్రెస్ ఓట్లు చీలుతున్నాయి. ఇది టీఆరెస్కు బలం కానుంది.
ఇన్ని అంశాలు టీఆరెస్కు కలిసి వస్తున్న తరుణంలో.. సీఎం అక్కడే మకాం వేస్తాడని, దీన్ని ఆశామాషీగా తీసుకోవడం లేదని రాయడం.. ఆయన స్థాయిని తగ్గించడమే. బీజేపీకి భయపడుతున్నారనే ప్రచారానికి ఊతమివ్వడమే అవుతుంది. కేసీఆర్ ఒక్క బహిరంగ సభ పెడితే సరిపోదా..? ఒక్కటి కాకపోతే.. రెండు. కానీ ఇంతలా హైప్ క్రియేట్ చేసి బీజేపీని మరింత లేపడానికి జాకీలు పెట్టేలా ఉన్న ఈ వార్త నమస్తేలో అవసరమా..? బ్యానర్ వార్తగా ఇది వచ్చిందంటే సీఎం నుంచి సంకేతాలు రాందే ఇది రాసే ధైర్యం లేదనే చెప్పాలి. కానీ అలా జరిగినా ఇలాంటి నిర్ణయం సీఎం తీసుకోవడం మాత్రం కరెక్టు కాదు.