మూడేండ్లు దాటింది. ఐనా జీతాలు పెంచ‌లేదు. ఏడాదికేడాది ఎదురుచూపులు. ఈసారి క‌చ్చితంగా పెంచుతార‌ట‌. ఏదో ఆశ‌. రోజులు… నెల‌లు.. సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నాయి. క‌రోనా త‌ర్వాత ప‌రిస్థితి మ‌రీ దారుణంగా మారింది. బ‌య‌ట నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు ఆకాశ‌న్నంటాయి. కానీ ఇక్క‌డ మాత్రం ఏండ్ల‌కేండ్లు జీతాల మాట‌లేదు. ఇంక్రిమెంటు ఊసులేదు.ఈ అంస‌తృప్తి, ఆక్రోషం న‌మ‌స్తే తెలంగాణ ఉద్యోగ‌లంద‌రిలో నివురు గ‌ప్పిన నిప్పులా రాజుకుంటూ వ‌స్తున్న‌ది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎడిష‌న్ టీం ధైర్యం చేసింది. మేనేజ్‌మెంట్‌పై తిర‌గ‌బ‌డింది. త‌మ అసంతృప్తిని ఆందోళ‌న రూపంలో వెలిబుచ్చింది.

నిన్న ఆ ఎడిష‌న్ సెంట‌ర్‌లోని ఎడిటోరియ‌ల్ టీమ్ అంతా ఆందోళ‌నకు దిగారు. పెన్ డౌన్ చేశారు. రెండు గంట‌ల పాటు ధ‌ర్నా చేయ‌డంతో నెట్ వ‌ర్క్ ఇన్చార్జి ఎస్జీవీ శ్రీ‌నివాస‌రావు రంగంలోకి దిగాడు. అయినా వారు అత‌ని మాట విన‌లేదు. ఎడిట‌ర్ కృష్ణ‌మూర్తి లైన్‌లోకి వ‌చ్చాడు. ఏదో పెంతామ‌న్నాడు. విన‌లేదు. ఇంక్రిమెంటు సంగ‌తేందీ..? అన్నారు. స‌రే చూద్దాం లే.. ముందు డ్యూటీ చేయండ‌య్యా బాబు.. నేను వ‌స్తా.. మాట్లాడుతా…. అన్నాడు. ఊహూ వినేది లేదు. హామీ ఇవ్వండి… అన్నారు. స‌రే త‌ప్ప‌కుండా మీర‌డిగిన‌వి చేస్తా… నేను వ‌చ్చి మీటింగు పెడ‌తా… అంటూ… బ‌తిమలుకుని బుజ్జ‌గించి ఎట్ట‌కేల‌కు ఆందోళ‌న‌ను విర‌మింప‌జేశారు.