టికెట్ నాక్కావాలంటే నాక్కావాలని మొన్నటి వరకు ఒకటే ఫైరవీలు… లాబీయింగులు. బీజేపీ నుంచి టికెట్ వస్తే చాలు ఇక తాము గెలిచినట్టేననే ఫీలింగు గత కొంతకాలం క్రితం. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బీజేపీ పాతాళంలోకి పడిపోయి కాలం కలిసొచ్చి కాంగ్రెస్ ఊపు పెంచింది. ఇప్పుడు అధికార పార్టీకి కాంగ్రెస్సే పోటీ. బీజేపీకిప్పుడంత సీన్లేదు. అందుకే ఇప్పుడు కేంద్రం కొత్త డ్రామాలకు తెర తీసింది. జమిలి అంటు ఓ బాంబ్ వేసింది. దీంతో ఇప్పటికే మూడు నెలల కాలం ఎలారా దేవుడా..? అని ప్రతిపక్షాలు తమకు టికెట్ వస్తే ఖర్చెలా భరించాలో తెలియక ఆగమాగమవుతుంటే.. కేంద్రం జమిలీ ఎన్నికల పేరుతో మరింత భయబ్రాంతులకు గురిచేస్తోంది.
అదే జరిగితే మరో నెల రోజుల కాలం పెరిగే అవకాశం ఉంది. రోజుకు లక్షల్లో ఖర్చులు. లెక్కకు, అంచనాకు మించి భారం. ఓ పక్క బీఆరెస్ అభ్యర్తులను ప్రకటించేసి కూర్చుంది. అదీ సిట్టింగులకు. వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఈ ఖర్చుల భారం పెద్దగా లెక్కకు రానివే అనుకో. అదీగాక అధిష్టానం తృణమో ప్రణమో సమర్పిస్తూనే ఉంది. ఇప్పటికే మొదటి దఫా ముట్టిందంటున్నారు. ఎన్నికల సమయానికి మరో దఫా.. అవసరమైతే మూడో దఫా.. ఇవీ గాక అభ్యర్థులు కొంత సొంతంగా పెట్టుకునే స్తోమత ఉండనే ఉంది. ఇక వీళ్లంతా జనాల్లో ఉన్నారు. రోజూ ప్రొసీడింగులు, అన్నదానాలు, మీటింగులు, కుల సంఘాలకు నజరానాలు ఇనవ్నీ నడుస్తున్నాయి ఇప్పట్నుంచే. కాంగ్రెస్, బీజేపీలకు ఇంకా అభ్యర్థులే ఖరారు కాలేదు.
కానీ కాంగ్రెస్లో మాత్రం టికెట్ల అంశం ఓ కొలిక్కి వచ్చింది. నేడో రేపో ప్రకటిస్తారని కూడా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో సరిగ్గా జమిలీ బాంబు వేసింఇ కేంద్రం. ఎట్లాగూ బీజేకి అంత సీన్ లేకుండా పోయింది. కేంద్రంలో బీజేపీ రావాలని కోరుకునే యువత, కొన్ని సెక్షన్లు ఇప్పటికీ మోడీ మానియాలో ఉండిపోయాయి. జమిలీ జరిగితే పార్లమెంటుతో పాటు అసెంబ్లీకి కూడా కలిసి వస్తుందనే దింపుడుకళ్లెం ఆశలో ఆ పార్టీ ఉంది. దీంతో కాంగ్రెస్లో ఇప్పుడు వణుకు పుట్టింది. బీఆరెస్ అభ్యర్థులు చేసేదీమీ లేదు. నిండా మునిగినోడికి చలిలేదన్నట్టు… టికెటిచ్చారు. ఇక తిరగాల్సిందే. ఆగేదే లేదు. ఆగితే కేసీఆర్ సర్వేలో వెనుకబడిపోతే.. చివరలో బీఫాం సమయానికి కేసీఆర్ చేతిస్తే.. ఇనవ్నీ అనుమానాలు, భయాల నడుమ సిట్టింగులు చేతి చమురు వదిలించుకుంటూ తెగ తిరిగేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆశావహులు, టికెట్ వస్తుందని తెలిసిపోయిన వారు మాత్రం… బాబ్బాబు.. ఇప్పుడే ప్రకటించకండి మీకు పుణ్యముంటుంది… ఈ ఖర్చులు మావల్ల కావంటూ బతిమాలుకుంటున్నారట. వీరూ తిరుగుతున్నారు జనాల్లో ఉన్నామని చెప్పడానికి కానీ పైపైనే. టికెట్ కన్ఫాం అయితే.. పోటీ పడాలి. పోటీగా ఖర్చు పెట్టాలి. ప్రోగ్రాంలు పెట్టాలి. బహిరంగ సభల్లో తిట్లదండకం అందుకోవాలి. మంచినీళ్లలా పైసలు వెదజల్లాలి. ఇనవ్నీ ఇప్పట్నంచీ మేము చేయాలేము. జర ఆ లిస్టు కాస్త ఆపుండ్రి నాయన.. అని వేడుకుంటున్నారట. ఇక బీజేపీకి ఇదేం భయం లేదు. ఇప్పుడిప్పుడు దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఎవరికి టికెట్ వరిస్తుందో తెలియదు. దీంతో ఏదో అలా పైపైన తిరుగుతూ సోషల్ మీడియాలో నిండా మునిగిపోయి ప్రచారం చేసుకుంటున్నారట. ఫ్రీయే కదా. అదీ అలవాటు చేసుకున్న తంతేనాయే. ఇదీ ముచ్చట. ఓ పక్క బీఆరెస్ ఖర్చులతో చమటోడ్చి తిరుగుతుంటే.. ఈ లోబడ్జెట్ సినిమాల ప్రతిపక్షాలు ప్రేక్షక పాత్ర పోషిస్తూ తమాషా చూస్తున్నాయి.