ఓవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం పేరుతో కవితను బద్నాం చేయాలని కేంద్రం చూస్తుందంటూ భగ్గుమని మండుతున్న టీఆరెస్ శ్రేణులకు … ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ కవిత తో ఇంటర్వ్యూ చేసిన తీరు మరింత అగ్గి రాజేసింది. కవిత అవనసంగా రాధాకృష్ణ ఇంటర్వ్యూకు వెళ్లిందా..? అని టీఆరెస్ శ్రేణులు అంతర్మథనంలో పడ్డాయి. ఇంటికి పిలిచి మరీ అవమానించిన తీరుగా ఇంటర్వ్యూలో రాధాకృష్ణ అడ్డమైన ప్రశ్నలు… నోటిదూల, కక్షపూరితంగా వ్యవహరించిన తీరుపై మండిపడుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో రాధాకృష్ణపై భగ్గుమని మండిపోతూ పోస్టులు పెడుతున్నారు.
ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన నమస్తే తెలంగాణ పత్రికను .. అసలు అది పత్రికనే కాదని, దాన్ని కేసీఆర్ కూడా చదవడం లేదని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత బంధు పథకం ఎందుకని, ఒక్కొక్కరికి పది లక్షలు ఎలా ఇస్తారంటూ దబాయించి మరీ అడగడం… దళితులను అవమానపర్చడం కాదా ..? అని ఆర్కేను నిలదీస్తున్నారు.
కవితపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశాడని రాసిన వార్తను సమర్థించుకుంటూ తనకు పక్కాగా సమాచారం ఉందని, అక్కడున్న వారే చెప్పారని అనడం నమ్మశక్యంగా లేదు. అంత అంతర్గతంగా మాట్లాడిన మాటలు రాధాకృష్ణకు ఎలా తెలుస్తాయి..? ఒకవేళ తెలిస్తే… సీఎంవోలు రాధాకృష్ణకు అంతర్గత సమాచారాలు చేరే వేసే గ్యాంగు ఉందని అనుకోవాలా.,..? ఇది జర్నలిజమా..? తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఎంతటి అబద్దాలనైనా ఆడి సమర్థించుకోవడంతో పాటు కవితను కక్షపూరితంగా ఇంటర్వ్యూకు పిలిచి అవమానపరిచి పంపాడని టీఆరెస్ శ్రేణులు మండిపడుతున్నారు. జీర్ణించుకోలేకపోతున్నారు. కవిత అనవసరంగా ఇంటర్వ్కూకు వెళ్లిందని, వెళ్లకపోతే బాగుండనే అంతర్మథనంలో పడ్డారు.